హైదరాబాద్, మార్చి 11 (నమస్తే తెలంగాణ): విత్తనరంగంలో తెలంగాణ అద్భుతమైన అభివృద్ధిని సాధించిందని కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి బీసీ పాటిల్ ప్రశంసించారు. ఇక్కడి వ్యవసాయ, విత్తన రంగాల అభివృద్ధికి చేపడుతున్న సంస్కరణలను కర్ణాటకలోనూ అమలు చేస్తామని చెప్పారు. ఈ రంగాల అభివృద్ధిపై అధ్యయనం చేసేందుకు శుక్రవారం ఆయన నేతృత్వంలోని కర్ణాటక అధికారుల బృందం తెలంగాణలో పర్యటించింది. రాజేంద్రనగర్లోని ఇంటర్నేషనల్ సీడ్ టెస్టింగ్ అసోసియేషన్ (ఇస్టా) ల్యాబ్ను సందర్శించింది. అనంతరం తెలంగాణ సీడ్ కార్పొరేషన్ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మంత్రి పాటిల్ మాట్లాడుతూ.. రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తున్నదని, నకిలీ విత్తన వ్యాపారులపై పీడీ యాక్ట్ ప్రయోగింంచడం ఆదర్శనీయమని కొనియాడారు. ఇస్టా ల్యాబ్ను కర్ణాటకలోనూ ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలను రూపొందించాలని తమ అధికారులను ఆదేశించారు.
12 రాష్ర్టాలకు విత్తనాల ఎగుమతి..
రాష్ట్రంలో వ్యవసాయ, విత్తన రంగాల అభివృద్ధికి చేపడుతున్న పథకాలు, సంస్కరణల గురించి తెలంగాణ విత్తన సంస్థల ఎండీ డాక్టర్ కేశవులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కర్ణాటక బృందానికి వివరించారు. తెలంగాణ నుంచి దాదాపు 12 రాష్ర్టాలకు విత్తనాలు సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. సీఎం కేసీఆర్ పలు సంస్కరణలతో వ్యవసాయ విప్లవాన్ని తీసుకొచ్చారని కొండబాల కోటేశ్వరరావు తెలిపారు. రాష్ట్రంలో దాదాపు 400 విత్తన కంపెనీలు ఉన్నాయని, దేశానికి కావాల్సిన 60 శాతం విత్తనాలు తెలంగాణ నుంచే సరఫరా అవుతున్నాయని వివరించారు. అన్ని రాష్ర్టాల సీడ్ కార్పొరేషన్లతో త్వరలో హైదరాబాద్లో జాతీయస్థాయి సదస్సు నిర్వహించనున్నట్టు చెప్పారు. ఈ సదస్సుకు హాజరుకావాలని మంత్రి పాటిల్ని ఆహ్వానించారు. సమావేశంలో కర్ణాటక వ్యవసాయశాఖ మంత్రి ఓఎస్డీ మంజు, వాటర్షెడ్ డెవలప్మెంట్ కమిషనర్ డాక్టర్ ఎంవీ వెంకటేశ్, వ్యవసాయశాఖ జాయింట్ డైరెక్టర్లు తిమ్మయ్య, వెంకటేశ్, అగ్రికల్చర్ డైరెక్టర్ నందినీ కుమారి, సేంద్రియసాగు అడిషనల్ డైరెక్టర్ వెంకటరమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.