హరిత అడవులకు ‘గుబ్బ’ భాగస్వామ్యం
హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): కార్పొరేట్ సామాజిక బాధ్యత కింద ‘మన విత్తనం మన ప్లానెట్’ ప్రచారంలో భాగంగా లక్ష విత్తన బంతులను డ్రోన్ల ద్వారా సరఫరా చేయాలని హైదరాబాద్లోని ప్రముఖ శీతల గిడ్డంగుల సంస్థ ‘గుబ్బ కోల్డ్ స్టోరేజీ’ నిర్ణయించింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ విత్తన కంపెనీలు సింజెంటా, గంగాకావేరి మద్దతునిస్తున్నాయి. స్థానికులకు ఆర్థిక సాధికారత కల్పించేందుకు క్యాషియా ఫిస్టులా, సీతాఫలం, చింత, మోదుగు, అల్సీ, నీమిలినారా, మర్రి, రావి మొదలైన విత్తనాలతో విత్తన బంతులను తయారుచేసింది. భౌతికంగా చేరుకోవడానికి సాధ్యం కాని కొండలు, లోతైన అటవీ ప్రాంతాల్లో విత్తన బంతులను ఉపయోగించడానికి ‘మరుథ్’ డ్రోన్లను తెలంగాణ అటవీశాఖ గుర్తించింది.