హైదరాబాద్ : మీరు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్తున్నారా? జర జాగ్రత్త.. సొంత వాహనంలో వెళ్లే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. అక్కడ వసూలు చేసే పార్కింగ్ ఫీజు ఏకంగా వందల్లో ఉంది. ఓ ప్రయాణికుడు తన వాహనాన్ని అర గంట పాటు మాత్రమే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో పార్క్ చేశాడు. ఆ సమయానికే రూ. 500 పార్కింగ్ ఫీజు వసూలు చేశారు. అర గంటకే రూ. 500 వసూలు చేయడంతో సదరు ప్రయాణికుడు లబోదిబోమన్నాడు. పార్కింగ్ నిర్వాహకులతో వాదించినప్పటికీ లాభం లేకుండా పోయింది. దీంతో చేసేదేమీ లేక బాధిత ప్రయాణికుడు తనకు జరిగిన అన్యాయాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేవలం 31 నిమిషాలకు పార్కింగ్ ఫీజు రూ. 500 వసూలు చేయడాన్ని కేటీఆర్ తప్పుబట్టారు. ఇది దారుణమని వ్యాఖ్యానించారు.
నగరానికి చెందిన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ ఏకే జైరథ్ ఈ నెల 4వ తేదీన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు వెళ్లాడు. అక్కడున్న పార్కింగ్లో తన వాహనాన్ని పార్క్ చేశాడు. తన పని పూర్తయిన అనంతరం తిగిరి పార్కింగ్కు చేరుకున్నాడు. తనకు ఇచ్చిన పార్కింగ్ ఫీజును చూసి ఆర్మీ ఆఫీసర్ షాక్ అయ్యాడు. కేవలం 31 నిమిషాలకు రూ. 500 వసూలు చేయడం ఏంటని ఆశ్చర్యపోయాడు. ఇదేక్కడి దారుణమని ప్రశ్నించాడు. అయినప్పటికీ పార్కింగ్ నిర్వాహకులు ఆయన మాటలు ఏ మాత్రం వినిపించుకోకుండా రూ. 500 వసూలు చేశారు. పార్కింగ్ ఫీజు రూ. 423.73 పైసలు కాగా, సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ కింద రూ. 38.14 చొప్పున వసూలు చేశారు.
ఈ వ్యవహారాన్ని రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి ట్విటర్ ద్వారా తీసుకెళ్లారు. రైల్వే పార్కింగ్ ఫీజుపై కేటీఆర్ స్పందిస్తూ.. ఇది దారుణమన్నారు. పార్కింగ్ ఫీజులు అధికంగా వసూలు చేస్తున్న విషయాన్ని కేంద్ర రైల్వే మంత్రి ఆశ్విని వైష్ణవ్ దృష్టికి కేటీఆర్ తీసుకెళ్లారు. దీనిపై అధికారులకు సూచనలు చేయాలని సూచించారు.
Atrocious indeed!
— KTR (@KTRTRS) November 10, 2021
Request Railway minister @AshwiniVaishnaw Ji to direct officials to do away with fleecing citizens as pointed out by Brigadier Jairath ji 👇 https://t.co/Wt0GlSWFRQ