హైదరాబాద్, అక్టోబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా నిరోధించేందుకు రిజిస్ట్రేషన్ చట్టం-1908లో సెక్షన్ 22ఏను చేర్చడం సబబేనని హైకోర్టు తీర్పు చెప్పింది. ఆ సెక్షన్తో ప్రభుత్వ భూములకు రక్షణ లభిస్తుందని పేర్కొన్నది. సెక్షన్ 22ఏ నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా అధికారులు తమ అధికారాన్ని వినియోగించుకోవచ్చని స్పష్టం చేసింది. ఉమ్మడి ఏపీ ప్రభుత్వ హయాంలో చేర్చిన ఈ సెక్షన్ను సవాలు చేస్తూ ఇన్వెక్టా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఇతరులు దాఖలు చేసిన రిట్ పిటిషన్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్కుమార్ ధర్మాసనం శుక్రవారం విచారణ జరిపింది. రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 17ను సెక్షన్ 22ఏ ఉల్లంఘిస్తున్నదని, ఇది చట్టవిరుద్ధమని పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదించారు.
దీనిపై అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ స్పందిస్తూ.. రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హకులను ఉల్లంఘిస్తూ శాసనసభలు ఏమైనా చట్టాలను చేస్తే వాటిని మాత్రమే సవాలు చేసేందుకు అవకాశం ఉంటుందని, ఇతర చట్టాలను సవాలు చేసేందుకు వీలుండదని వివరించారు. రిజిస్ట్రేషన్ చట్టంలో సెక్షన్ 22ఏను చేర్చిన తర్వాత రాష్ట్రపతి ఆమోదించారని, ఈ సెక్షన్ కింద ఏదైనా డాక్యుమెంట్ చట్టబద్ధతను నిర్ణయించే అధికారం అధికారులకు ఇవ్వలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో రాజ్యాంగంలోని ఆర్టికల్ 300ఏను సెక్షన్ 22ఏ ఉల్లంఘిస్తున్నదన్న వాదన సరికాదని పేర్కొన్నారు. ఎవరైనా బాధితులు ఉంటే రిజిస్ట్రేషన్ చట్టంలోని సెక్షన్ 22ఏ(4) ద్వారా పరిషరించుకోవచ్చని చెప్పారు. దీంతో సెక్షన్ 22ఏను సమర్థిస్తూ తీర్పు చెప్పిన ధర్మాసనం.. ఆ పిటిషన్లను కొట్టేస్తున్నట్టు ప్రకటించింది.