హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్లో మే 30 నాటికి కరోనా సెకండ్వేవ్ తీవ్రత తగ్గుముఖం పడుతుందని గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన ఎస్ఆర్ఎం ప్రైవేటు యూనివర్సిటీ విద్యార్థుల బృందం తెలిపింది. జూలై 15 నాటికి కొవిడ్ కేసులు కనీస స్థాయికి పడిపోతాయని పేర్కొన్నది. ఈ మేరకు రూపొందించిన నివేదికను సీఎం జగన్ వ్యక్తిగత ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ప్రకాశ్కు మెయిల్ ద్వారా పంపినట్టు తెలిసింది. ప్రస్తుతం ఏపీలో రోజుకు 20 వేల పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 30 నాటికి 5 వేలకు చేరుతాయని నివేదికలో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా వాడుకలో ఉన్న సస్పెక్టబుల్ ఇన్ఫెక్టెడ్ అండ్ రికవరీ మోడల్ ఆధారంగా ర్యాండమ్ పారెస్ట్ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్ సాయంతో డాటాను తయారుచేసినట్టు విద్యార్థులు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కొవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా విడుదలచేస్తున్న రోజువారీ పాజిటివ్ కేసులు, రికవరీ కేసుల డాటాతో ఎస్ఐఆర్తో డాటాను అనుసంధానించి కరోనావ్యాప్తి అంచనాలు రూపొందించినట్టు వెల్లడించారు. మార్చి 3 నుంచి నమోదైన కేసుల ఆధారంగా డాటాను విశ్లేషించినట్టు తెలిపారు. ఏపీలో ఈ నెల 21 నాటికి రోజుకు 10 వేల పాజిటివ్ కేసులు, 30వ తేదీకి ఐదువేలు, జూన్ 14వ తేదీకి వెయ్యి కేసులు, జూన్ 23 నాటికి 500 కేసులు, జూలై 15 నాటికి రోజుకు వందకంటే తక్కువ పాజిటివ్ కేసులు నమోదవుతాయని నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదికలోని అంశాలు నిజం కావాలంటే కొవిడ్ కట్టడి చర్యలు పటిష్టంగా అమలవ్వాలని, ప్రజలు కూడా మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తే పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గే అవకాశముందని నిపుణులు, డాక్టర్లు అభిప్రాయపడ్డారు.