విస్తీర్ణం పరంగా మన విమానాశ్రయం
ఢిల్లీ ఎయిర్పోర్టు కన్నా పెద్దది : కేసీఆర్
హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): శంషాబాద్ విమానాశ్రయంలో రెండో రన్వే ఏర్పాటు కానున్నది. ఈ మేరకు రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం నిర్ణయించింది. రెండో రన్వే ఏర్పాటుకు జీఎమ్మార్ సంస్థకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. శంషాబాద్ విమానాశ్రయం కోల్కతా, మద్రాస్లను వెనక్కు నెట్టి దేశంలోనే నాలుగో స్థానంలో నిలిచిందని సీఎం కేసీఆర్ వివరించారు. విస్తీర్ణ పరంగా ఢిల్లీతో పోల్చినా మన ఎయిర్పోర్టే పెద్దదని చెప్పారు.
ఢిల్లీ విమానాశ్రయం ఐదు వేల ఎకరాలు ఉండగా.. శంషాబాద్ విమానాశ్రయం 5,200 ఎకరాలు ఉన్నదన్నారు. ఈ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్పోర్టులో రెండో రన్వే ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జీఎమ్మార్ సంస్థను ఆదేశించామని తెలిపారు. ఇప్పుడున్న టెర్మినల్కు దక్షిణంలో పాత రన్వే ఉన్నదని, టెర్మినల్ మధ్యలో ఉత్తరం దిక్కుకు మరో రన్ వే వస్తుందన్నారు.ఈ రంగంలో మనం రెండోస్థానంలో ఉన్నాం కాబట్టి కొత్తగా ఏర్పాటుచేసే సీఐఈ యూనివర్సిటీలో సివిల్ ఏవియేషన్ కోర్సులను ప్రారంభించాలని ఆదేశించామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.