హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మరో ప్రతిష్ఠాత్మక సదస్సుకు వేదిక కానున్నది. ఈ నెల 6, 7 తేదీల్లో జీ 20 సమావేశాలు హైదరాబాద్ వేదికగా జరగనున్నాయి. గ్లోబల్ పార్ట్నర్షిప్ ఫర్ ఫైనాన్సియల్ ఇన్క్లూజన్ (జీపీఎఫ్ఐ) పేరుతో జీ 20 సదస్సు జరగనున్నది. దేశంలో తొలి సమావేశం జనవరిలో కోల్కతాలో జరుగగా, రెండో సమావేశానికి హైదరాబాద్ వేదికైంది. ఈ సమావేశాలకు జీ 20 దేశాల ప్రతినిధులతోపాటు ఆహ్వానిత దేశాల ప్రతినిధులు, ఇతర అంతర్జాతీయ ప్రతినిధులు హాజరవుతారు. శుక్రవారం హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ (హెచ్ఐసీసీ)లో జీ 20 ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ హర్షవర్ధన్ ష్రింగ్లా మాట్లాడుతూ సమావేశ వివరాలను వెల్లడించారు.
ఈ సమావేశాలకు ముందు మార్చి 4 నుంచి 6వ తేదీ వరకు గ్లోబల్ సౌత్ ఎమర్జింగ్ ఎకానమీ కోసం నాలెడ్జ్ అండ్ ఎక్స్పీరియన్స్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆర్థిక వ్యవస్థ, భవిష్యత్తు ప్రణాళిక, జీ 20 యేతర దేశాల భాగస్వామ్యం, జీ 20తోపాటు ఇతర దేశాల్లో డిజిటల్ చెల్లింపులు తదితర అంశాల గురించి చర్చించనున్నట్టు వివరించారు. హైదరాబాద్లో జరిగే జీ 20 సమావేశాలకు 40 దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరవుతారని తెలిపారు. ఇక్కడ మౌలిక సదుపాయాలు అద్భుతంగా ఉన్నాయని ఆయన ప్రశంసించారు.