హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి/కంది, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లా కందిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్ (ఐఐటీహెచ్)లో దేశంలోనే రెండో అతి పెద్ద 14 అంగుళాల టెలిస్కోప్ను ఏర్పాటు చేశారు. ఇప్పటికే ఐఐటీ కాన్పూర్ అతి పెద్ద టెలిస్కోప్ ఉన్నది. ఈ ప్రాజెక్టుకు ఐఐటీ హైదరాబాద్ డైరెక్టర్ ప్రొఫెసర్ బీఎస్ మూర్తి నిధులు సమకూర్చారు. దీనిని భౌతికశాస్త్ర విభాగం డాక్టర్ మయూఖ్ పర్యవేక్షిస్తారు. ఈ సదుపాయాన్ని తిరువనంతపురం ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ చాన్స్లర్, డాక్టర్ బీఎన్ సురేశ్ రెండురోజుల కిందట ప్రారంభించారు. అంతరిక్షంలోని వస్తువులు, గ్రహ వ్యవస్థలు, నక్షత్రాల వంటి వాటిని క్షుణ్ణంగా చూసేందుకు టెలిస్కోప్ను వినియోగిస్తారు. 165 మిల్లీమీటర్ల ఫోకల్ పొడవుతో 355 మిల్లీమీటర్ల వ్యాసంతో ఉన్న భారీ అద్దం ద్వారా రాత్రివేళల్లోనూ వివరణాత్మకంగా ఆకాశాన్ని వీక్షించే సౌలభ్యం ఈ టెలిస్కోప్లో ఉంటుంది. ఇక్కడ రికార్డు చేసిన చిత్రాలు, డాటా ఖగోళ పరిశోధనలకు ఎంతో ఉపకరించనున్నాయి. ఐఐటీహెచ్ ఆస్ట్రానమీ క్లబ్ నిర్వహించే వివిధ కార్యక్రమాల ద్వారా హైదరాబాద్, చుట్టుపక్కల పాఠశాలలు, వివిధ కళాశాలల విద్యార్థులు టెలిస్కోప్ ప్రయోజనాన్ని పొందుతారని ఆశిస్తున్నట్టు ఐఐటీహెచ్ డైరెక్టర్ ప్రొఫెసర్ మూర్తి తెలిపారు.