హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 13 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్/తెలుగు యూనివర్సిటీ: వారం నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వ్యాధుల నుంచి తప్పించుకొని ఆరోగ్యంగా ఉండాలంటే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తున్నారు. ముఖ్యంగా రోడ్డు పక్కన చిరుతిండ్లు తినవద్దని, ఎప్పటికప్పుడు వేడి ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
నీరు కలుషితం కావడం వల్ల టైఫాయిడ్, డయేరియా వంటి రోగాలు వస్తుంటాయి. ఈ మధ్య ఫీవర్ దవాఖానకు ఈ కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రతి ఒక్కరూ నీటిని కాచి చల్లార్చి తాగాలి. జ్వరం ఎక్కువగా ఉంటే వెంటనే డాక్టర్ను సంప్రదించాలి.
– డాక్టర్ కే శంకరం, సూపరింటెండెంట్, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్
డెంగ్యూ, టైఫాయిడ్, మలేరియా, వైరల్ ఫీవర్లు ఎక్కువవుతున్నాయి. గత మూడు నెలలుగా దవాఖానకు వచ్చే డెంగ్యూ రోగులు పెరుగుతున్నారు. జ్వరంతో పాటు కండ్ల భాగంలో మంటలు, తలనొప్పి, తెల్ల రక్త కణాలు (ప్లేట్ లెట్స్) తగ్గడం వంటి లక్షణాలు ఉంటే డెంగ్యూగా నిర్ధారించుకోవాలి.
– డాక్టర్ బీ నాగేందర్, సూపరింటెండెంట్, ఉస్మానియా దవాఖాన
వర్షాలు ఎక్కువగా పడుతున్నందున చిన్న పిల్లల ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వేడి చేసి చల్లార్చిన నీటినే తాగించాలి. వాంతులు, విరేచనాలు అయితే పిల్లలు నీరసపడకుండా చూసుకోవాలి. రెండు, మూడు రోజుల్లో జ్వరం, జలుబు తగ్గకపోతే డాక్టర్ దగ్గరికి వెళ్లాలి.
– డాక్టర్ రమేశ్ దాంపూరి, నిలోఫర్ దవఖాన యువ విభాగం నోడల్ ఆఫీసర్