Cyber crime | హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ): ఆన్లైన్లో కొత్తగా ఏమైనా వెతుకున్నారా? తస్మాత్ జాగ్రత్త. సెర్చింగ్ ఇప్పుడు సైబర్ దొంగలకు వరంగా మారింది. జీవితభాగస్వామి కోసం వెతికితే మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్స్, పార్ట్టైమ్ ఉద్యోగాల కోసం వెతికితే పార్ట్టైమ్ జాబ్ ఫ్రాడ్స్, లోన్ల కోసం వెతికితే లోన్ ఫ్రాడ్స్ ఇలా.. సైబర్ దొంగలు మీరు సెర్చ్ చేసే అంశాలను ఆయుధంగా మలుచుకుంటున్నారు. ఓ వ్యక్తిని రోజుకు ఎన్ని గంటలు ఆన్లైన్లో ఉంటున్నాడు? మొబైల్ చూసే స్క్రీన్ టైమ్ ఎంత? ఆ సమయంలో పదేపదే ఏం వెతికాడు? ఏం చూశా డు? వీటిపైనే సైబర్ నేరగాళ్లు దృష్టి సారిస్తున్నారు. మన మొబైల్లోని థర్డ్పార్టీ యాప్స్, నెట్ చూసేటప్పుడు టర్మ్స్ అండ్ కండీషన్స్ చదవకుండా అనుమతించే కుకీస్తో మన స్మార్ట్ఫోన్ను గాలించేస్తున్నారు. ఏదైనా ఎరవేస్తే.. ఆన్”లైన్లోకి వస్తాడా?, రాడా’ అని విశ్లేషిస్తున్నారు. ప్రస్తుతం సైబర్ బాధితుల్లో చాలామందికి ని త్యం న్యూస్ చూసే, పేపర్లు చదివే అలవాటు లేదని పోలీసులు, సైబర్ నిపుణులు చెప్తున్నారు. సైబర్ నేరగాళ్లు టార్గెట్లో ఇది కూడా ఓ కారణమని అంటున్నా రు. సైబర్ నేరాల తీరును విశ్లేషిస్తే ప్రభుత్వ ఉద్యోగులు, ప్రైవేట్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లే ఎక్కువమంది బాధితులు ఉన్నారు.
మూన్లైటింగ్.. సాఫ్ట్వేర్ ఇంజినీర్ సంతోష్కు కొత్తగా అనిపించింది. ఏకకాలంలో రెండు సంస్థల్లో పనిచేయడం కిక్కిచ్చింది. మంత్ ఫస్ట్కే రెండు శాలరీలు అందుకోవచ్చని ఆశపడ్డాడు. వెంటనే ‘పార్ట్టైమ్ సాఫ్ట్వేర్ జాబ్స్’ అని నెట్లో సెర్చ్ చేశాడు. కొన్ని కంపెనీల ప్రొఫైల్స్ చూశాడు. తీరా శాలరీ విషయంలో వెనక్కి తగ్గాడు. ఆ మరుసటి రోజే సంతోష్కు అపరిచిత కాల్ వచ్చింది. ఆ వ్యక్తి ప్రొఫెషనల్ మాటతీరుతో ముచ్చటైన శాలరీ ఆఫర్ చేశాడు. కొత్త పని అప్పగించి, రెండ్రోజులకు రూ.2 వేలు అకౌంట్లో వేశాడు. మరుసటి రోజు అతని నుంచే కాల్.. ‘ఇవన్నీ టైమ్ వేస్ట్ పనులు. తెలిసిన కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ ఆలోచన చేయాలని ఖరీదైన సలహా ఇచ్చాడు. ఆలోచించకుండానే ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్లో అడ్డంగా బుక్కయ్యాడు సంతోష్. అప్పటి వరకు దాచుకున్న రూ.20 లక్షలు సైబర్ దొంగల చేతిలో పెట్టాడు.