ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప ఆలయంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. దేశవ్యాప్తంగా ఈ ఆలయం ఘనచరిత్ర, శిల్ప కళపై చర్చ జరుగుతున్నది. ఆన్లైన్లో రామప్ప ఆలయం విశేషాలు తెలుసుకొనేందుకు నెటిజన్లు ఆసక్తి కనబరుస్తున్నారు. నేడు మారుమూల పల్లెగా మారిపోయిన పాలంపేట కాకతీయుల కాలంలో ప్రముఖ పట్టణమని తెలుసుకొని ఆశ్చర్యపోతున్నారు. -వరంగల్, జూలై 27(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలో ఉన్న పాలంపేట గ్రామం కాకతీయుల కాలంలో ప్రముఖ పట్టణంగా వెలుగొందిందని చరిత్ర చెప్తున్నది. శిల్పకళకు ఈ ప్రాంతం విశ్వవిద్యాలయమని తెలుస్తున్నది. పాలంపేటలో రామప్పతోపాటు మరో పది ఆలయాలున్నాయి. అందుకే ఈ ప్రాంతాన్ని గుళ్ల రామప్పగా పిలుస్తారు. రామప్ప చుట్టూ ఉన్న ఆలయాలను పరివార ఆలయాలంటారు. వీటి నిర్మాణ కాలంపై సరైన చారిత్రక ఆధారాలు లేవు. వీటిలో శైవ, వైష్ణవ ఆలయాలు ఉన్నాయి. ఒక ఆలయంలో శ్రీకృష్ణుడి శిల్పాలుండటం విశేషం. కాకతీయులు నిర్మించిన వాటిలో శైవ ఆలయాలే అధికంగా ఉంటాయి. రామప్ప అంతటి పటిష్టమైన నిర్మాణం లేకపోవడం వల్ల ఉపాలయాలు కుంగిపోయాయి. మరికొన్ని ధ్వంసమయ్యాయి. రామప్ప చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దపెద్ద రాళ్లను తెచ్చి ఆలయాలకు వాడారు. ఇక్కడి ఆలయాలు నిత్య పూజలు, భక్తుల రాకపోకలు, సైనికుల కవాతులతో సందడిగా ఉండేవని చరిత్రకారులు చెప్తున్నారు. రామప్పకు నైరుతి వైపున గొల్లగుడి పేరుతో త్రికూటాలయం ఉన్నది. రామప్పను మైమరపించే శిల్ప సంపద ఈ గుడి సొంతం. పేరిణి నృత్య శిల్పాలతోపాటు మైథున శిల్పాలుండటం ఈ ఆలయ ప్రత్యేకత. రామప్పకు వాయవ్యంలో చాళుక్య రీతిలో నిర్మించిన మరోగుడి ఉన్నది. రామప్ప చెరువుకట్టపై కుడివైపున ఒక త్రికూటాలయం ఉన్నది. ప్రధానాలయం నుంచి దక్షిణంగా రామప్ప చెరువు వైపు వెళ్తే పంట పొలాల్లో శిథిలావస్థలో మూడు ఆలయాలున్నాయి. రామప్ప ప్రవేశ ద్వారం వద్ద కుడివైపు మరో త్రికూటాలయం ఉన్నది. ఇందులో మూడు శివలింగాలున్నాయి. రామప్పకు దక్షిణాన కొండల మధ్య తూర్పు-పశ్చిమాలుగా కట్ట నిర్మించడంతో రామప్ప చెరువు ఏర్పడింది. 13 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఈ చెరువు ఎంతో అహ్లాదకరంగా ఉంటుంది.
శాసనానికీ రక్ష..
రామప్ప ఆలయానికే కాకుండా అక్కడ వేసిన శాసనానికీ ఒక ప్రత్యేకత ఉన్నది. ప్రాచీన కాలంనాటి ప్రధాన కట్టడాల వివరాలు భావితరాలకు తెలిపేందుకు శాసనాలు వేసేవారు. రామప్ప ఆలయాన్ని నిర్మించిన రేచర్ల రుద్రుడు ఆలయ ఆవరణలో శాసనం వేయించారు. దీని రక్షణకు ఆనాడే ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 204 సంస్కృత పంక్తులతో రాయిపై శాసనాన్ని చెక్కారు. ఎండవానల నుంచి రక్షణకు దానికి గుడి తరహాలో మండపాన్ని కట్టారు. రుద్రసేనాని (రేచర్ల రుద్రుడు) వంశం వివరాలు, కాకతీయ రాజులకు వారు అందించిన సేవలు, ఓరుగల్లు పట్టణ వైభవం గురించి శాసనంలో వర్ణించారు. రామప్ప ఆలయ దేవతలైన రుద్రేశ్వర, కాటేశ్వర, కామేశ్వరస్వాములకు శాలివాహన శకం (1,135 సంవత్సరం) శ్రీముఖ నామ సంవత్సరం, చైత్రమాసం, శుక్లపక్షం, అష్టమి తిథి, పుష్యమి నక్షత్రం ఆదివారం ఆలయాల నిర్మాత రేచర్ల రుద్రయ్య తన రాజ్యంలోని కొన్ని గ్రామాలను శాశ్వత ధర్మముగా దానం ఇచ్చినట్టు శాసనంలో ఉన్నది. ఆ తేదీ ఆంగ్ల సంవత్సరం ప్రకారం 1,213, మార్చి 31గా నిర్ధారించారు. రేచర్ల రుద్రుడు శాసనంలో ‘మేము ఎవరికైనా శత్రువు కావచ్చుగానీ ఈ ఆలయం కాదు. కాబట్టి దీన్ని ధ్వంసం చేయకూడదు. బాధ్యతలో ఉన్నవాళ్లు ఆలయాలను కాపాడకపోతే పదివేల జన్మలు పేడలో పురుగులుగా పుడతారు’ అని రాయించారు.
10 వేల టన్నుల రాళ్ల క్వారీ
800 ఏండ్ల చరిత్ర ఉన్న రామప్ప ఆలయం కల్యాణమండపం, రెండు త్రికూటాలయాలు కలిపి పది ఎకరాల్లో విస్తరించి ఉన్నది. రామప్ప గుడికి దాదాపు 3,500 టన్నుల ఎర్ర ఇసుకరాయి, 1,500 టన్నుల నల్లరాయి వాడినట్టు అంచనా. గణపురం దేవాలయాలకు 3 వేల టన్నుల రాళ్లను వాడారు. అన్ని ఆలయాలకు కలిపి దాదాపు 10 వేల టన్నుల రాయిని వాడినట్టు అంచనా. రామప్ప ఆలయ ద్వారాలు, స్తంభాలు, దూలాలకు డోలరైట్ నల్లరాయిని వాడగా, మిగతా నిర్మాణమంతా ఎరుపు ఇసుకరాయితో ఉంటుంది. నల్లరాయిని ఓరుగల్లు (వరంగల్) సమీప ప్రాంతాల నుంచి తరలించారు. ఎరుపు రాయిని రామప్ప గుడికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న గుట్టల నుంచి తొలిచినట్టు పరిశోధకులు గుర్తించారు. రాళ్లను తొలిచేందుకు వినియోగించిన పనిముట్ల గుర్తులు, వాటిని తయారుచేసిన కొలిమిలు, పనిముట్లు నిల్వచేసిన ఆనవాళ్లు ఆ గుట్టలపై ఇప్పటికీ ఉన్నాయని ప్రముఖ చరిత్రకారుడు శివనాగిరెడ్డి వెల్లడించారు.
నిజాం కాలంలో పునరుద్ధరణ
నిజాం ప్రభుత్వంలో 1914లో ఏర్పడిన పురావస్తుశాఖ ఈ ఆలయాలను వీలైనంతగా పునరుద్ధరించింది. నిజాం ప్రభుత్వంలో పురావస్తు శాఖ మొదటి డైరెక్టర్ గులాం యాజ్దాని రామప్ప ఆలయ పునరుద్ధరణ కోసం ప్రత్యేక శ్రద్ధ చూపారు. బలహీనంగా ఉన్న పైకప్పు పటిష్టత కోసం రాతి దూలాలను ఏర్పాటు చేయించారు. ఆ తర్వాత ఈ ప్రాంతం కేంద్ర పురావస్తుశాఖ పరిధిలోకి వెళ్లింది. అనంతర కాలంలో పురావస్తుశాఖ ఆలయ శిఖరాన్ని పునర్మించింది. పునాదుల్లోకి వాననీరు ఇంకకుండా ప్లాస్టరింగ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ప్రాంతమే అయినా తెలంగాణ ప్రభుత్వం రామప్ప ఆలయ పరిసరాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపించింది. కోట్ల రూపాయలలో అభివృద్ధి పనులు చేయించింది. రోడ్లను విస్తరించింది.