హైదరాబాద్: సమైక్య పాలనలో తెలంగాణలో ప్రణాళికాబద్ధంగా విధ్వంసం జరిగిందని ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. 2014కు ముందు తెలంగాణ దుర్బరమైన పరిస్థితుల్లో ఉండేదని చెప్పారు. ఎనిమిదిన్నరేండ్లలో రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అద్భుతంగా అభివృద్ధి చేశారన్నారు. సంక్షేమ రంగాల్లో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలిపారని వెల్లడించారు. కరోనా సంక్షోభంలోనూ తెలంగాణ ప్రగతి రథం ఆగలేదని తెలిపారు. సీఎం కేసీఆర్ పాలనా దక్షతకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. శాసనసభలో బడ్జెట్పై జరిగిన చర్చలో ఎమ్మెల్యే పద్మాదేవందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైతుబంధు పథకం గతంలో ఏ ప్రభుత్వం చేయని గొప్ప ఆలోచన అని చెప్పారు. అన్నదాతల పట్ల సీఎం కేసీఆర్కు ఉన్న ప్రేమకు రైతుబంధు నిదర్శనమన్నారు. ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీళ్లు ఇవ్వకుంటే ఓట్లే అడగనన్న దమ్మున్న నాయకుడు సీఎం కేసీఆర్ అని వెల్లడించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధుతో ఎస్సీ బిడ్డల జీవితాల్లో వెలుగులు నిండాయని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని చెరువులు, జలాశయాలు మత్స్య సంపదతో కళకళలాడుతున్నాయని పేర్కొన్నారు. సర్కారు స్కూళ్లను కార్పొరేట్కు దీటుగా తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. కంటివెలుగు అద్భుతమైన కార్యక్రమమని, మొదటి విడుత కంటివెలుగు మంచి ఫలితాలనిచ్చిందని తెలిపారు.
రాష్ట్రానికి మెడికల్ కాలేజీలు ఇవ్వనందుకు కేంద్రం సిగ్గుపడాలని విమర్శించారు. కేంద్రం సహకరించకున్నా సీఎం కేసీఆర్ జిల్లాకో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతితో గ్రామీణ, పట్టణ ప్రాంతాల ముఖచిత్రాలు మారిపోయాయని చెప్పారు. పల్లెప్రగతికి అవార్డులిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి.. నిధులివ్వడానికి చేతులు మాత్రం రావని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఐటీ రంగం ద్వితీయశ్రేణి నగరాలకు కూడా విస్తరిస్తోందంటే ఆ ఘనత కేసీఆర్ సర్కారుదేనని చెప్పారు. ఆర్అండ్బీ శాఖలో హౌసింగ్ శాఖను విలీనం చేయడం హర్షనీయమన్నారు.