హైదరాబాద్ : కోతుల బెడదతో రైతులు, సామాన్య జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, సమస్య పరిష్కారానికి అవసరమైన సూచనలు చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన నేపథ్యంలో అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి, వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి అటవీ, వెటర్నరీ, వ్యవసాయశాఖ అధికారులు, నిపుణులతో సమీక్ష నిర్వహించారు.
హిమాచల్ప్రదేశ్తో పాటు ఇతర రాష్ట్రాల్లో కోతుల బెడదను నివారించేందుకు అవలంభిస్తున్న విధానాలు – అధ్యయనం, చట్ట పరిధిలో తీసుకోవాల్సిన చర్యలు, సంతానాన్ని నివారించేందుకు ఆపరేషన్ల నిర్వహణ, పునరావాస కేంద్రాల ఏర్పాటు తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడారు. కోతుల బెడద రైతులకు రైతులనొప్పిగా మారిందని, ఈ సమస్యను గట్టెక్కించేందుకు సమగ్ర అధ్యయనం జరుగడంతో పాటు పరిష్కార మార్గాలను అన్వేషించాలని అధికారులను ఆదేశించారు.
ఏది ఏమైనా బెడద నుంచి రైతులను కాపాడాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని స్పష్టం చేశారు. పీపీపీ మోడల్లో ప్రతీ జిల్లా కేంద్రంలో కోతుల సంరక్షణ, సంతాన నిరోధక ఆపరేషన్లు చేయడంతో పాటు కోతులు పంట పొలాలు, జనావాసాలపై దాడి చేయకుండా ఉండేందుకు అటవీ ప్రాంతం, రహదారులు, పల్లె, పట్టణ ప్రకృతి వనాల్లో విరివిగా పండ్ల మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలన్నారు.
హరితహార కార్యక్రమంలో పండ్ల మొక్కలు నాటడంతో వల్ల సత్ఫాలితాలు వస్తున్నాయని, దీన్ని మరింత ఉధృతం చేపట్టాలని సూచించారు. సమావేశంలో రాజ్యసభ సభ్యులు సురేష్రెడ్డి, కోతుల బెడద నివారణ కమిటీ కన్వీనర్, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పీసీసీఎఫ్ (సోషల్ ఫారేస్ట్రీ) ఆర్ఎం డోబ్రియల్, సీఎఫ్ (హైదరాబాద్) ఎంజే అక్బర్, వెటర్నరీ శాఖ, ఇతర శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.