హైదరాబాద్, అక్టోబర్ 6 (నమస్తే తెలంగాణ): సమగ్ర అభివృద్ధికి శాస్త్ర & సాంకేతికత (సైన్స్ అండ్ టెక్నాలజీ) కీలకమని అటవీ, పర్యావరణ, శాస్త్ర, సాంకేతిక శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఆయన అధ్యక్షతన తెలంగాణ రాష్ట్ర సైన్స్ అండ్ సాంకేతిక మండలి (టీఎస్ కాస్ట్) 3వ కార్యనిర్వాహక సమావేశం జరిగింది. ఎన్నడూ లేనివిధంగా టీఎస్ కాస్ట్ 2021-22, 2022-23లో రూ.15.14 కోట్ల గ్రాంటును ఇన్నోవేషన్ హబ్, సిల్ డెవలప్మెంట్, ఎస్సీ, ఎస్టీ సెల్, పేటెంట్ ఇన్ఫర్మేషన్ సెంటర్, నేషనల్ చిల్డ్రన్స్ సైన్స్ కాంగ్రెస్ వంటి కార్యక్రమాలకు వెచ్చించిందని సభ్య కార్యదర్శి ఎం నగేశ్ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పాఠశాల స్థాయి నుంచి సైన్స్ బోధనను మెరుగుపర్చేందుకు మౌలిక వసతుల కల్పన ఇతర అంశాలపై పాఠశాల విద్యాశాఖ, విద్యా పరిశోధన, శిక్షణ మండలితో టీఎస్ కాస్ట్ సమన్వయం చేసుకోవాలని సూచించారు.
మూఢనమ్మకాలతోపాటు నిత్యం ప్రజలు ఎదురొంటున్న సమస్యలపై కూడా శాస్త్రవేత్తలు దృష్టి సారించాలని సూచించారు. టీఎస్ కాస్ట్ పనితీరు బాగున్నదని అభినందించారు. ఆరోగ్యం, పర్యావరణం, జీవవైవిధ్యం, వ్యవసాయ రంగాలలో 25 పరిశోధన ప్రాజెక్టులు మంజూరు కావడం గర్వకారణమని పేర్కొన్నారు. సమావేశంలో స్పెషల్ సీఎస్ రజత్ కుమార్, ఆర్థిక శాఖ అదనపు కార్యదర్శి ఆర్ రవి, జేఎన్టీయూ వీసీ కట్టా నర్సింహా రెడ్డి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డైరెక్టర్ జనరల్ స్నేహలత, రెడ్కో వీసీఎండీ జానయ్య, తమిళనాడు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ & టెక్నాలజీ సభ్య కార్యదర్శి డాక్టర్ ఆర్ శ్రీనివాసన్ తదితరులు పాల్గొన్నారు.