ఇల్లంతకుంట రూరల్, ఏప్రిల్ 16 : చేసిన పనులకు సంబంధించి బిల్లు రాకపోవడంతో ఓ మాజీ సర్పంచ్ భర్త పాఠశాలకు తాళంవేసి నిరసన తెలిపాడు. మూడేండ్ల క్రితం మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ భర్త వెంకటనర్సింహారెడ్డి రూ.44 లక్షలతో రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం వల్లంపట్లలో రెండు పాఠశాల భవనాలతోపాటు డైనింగ్హాల్ నిర్మించాడు. దీనికి సంబంధించి రూ. 22 లక్షల బిల్లులు రాగా, మరో రూ. 22 లక్షల బిల్లుల కోసం డీపీవో, ఎంపీడీవో దృష్టికి తీసుకెళ్లినా రాకపోవడంతో విసిగిపోయాడు.
ఈ క్రమంలో గురువారం పాఠశాల నూతనగదులతోపాటు డైనింగ్హాల్కు తాళంవేశాడు. ఎస్ఎంసీ తీర్మానం మేరకు నిర్మాణాలు చేశామని, ఇప్పుడు బిల్లుల కోసం ఇబ్బందులు పెడుతున్నారని, బిల్లు వచ్చేవరకు పాఠశాల తాళం తీసేదిలేదని వెంకటనర్సింహారెడ్డి స్పష్టంచేశాడు. దీంతో ఉపాధ్యాయులు, విద్యార్థులు వరండాలోనే కూర్చోవాల్సిన పరిస్థితి నెలకొన్నది. ఎస్ఐ సిరిసిల్ల అశోక్ పాఠశాలను సందర్శించి గదులను పరిశీలించారు.