హైదరాబాద్, మార్చి 12 (నమస్తే తెలంగాణ) : ప్రైవేట్ మెడికల్ కళాశాలల్లో చదువుతున్న హౌస్ సర్జన్లు, పీజీ విద్యార్థులకు తక్షణమే ఉపకార వేతనాలు చెల్లించాలని వామపక్ష విద్యార్థి, యువజన సంఘాలు గురువారం ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహను కలిసి వినతిపత్రం అందజేశాయి. రాష్ట్రంలోని 27 ప్రైవేట్ మెడికల్ కళాశాలు పీజీ, హౌస్ సర్జన్ల విద్యార్థులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయని మంత్రి దృష్టి తీసుకెళ్లారు.
దీనిపై స్పందించిన మంత్రి.. తక్షణమే కళాశాలల వివరాలు తెలుసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కొన్ని మెడికల్ కళాశాలలు ఎన్ఎంసీ నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయని మండిపడ్డారు. విద్యార్థుల ఏటీఎం, బ్యాంకు పాస్బుక్లు దగ్గర పెట్టుకుంటున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులు శనిగరపు రజినీకాంత్, కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కోట రమేశ్, కార్యదర్శి అనగంటి వెంకటేశ్, పీ మహేశ్, అశోక్రెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు
హైదరాబాద్, మార్చి12 (నమస్తే తెలంగాణ): గిరిజన జాతి సారా అమ్మి బాగుపడ్డదని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత హేయమని లంబాడీ హకుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు ముడావత్ రాంబల్నాయక్ మండిపడ్డారు. ఈ మేరకు ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు గిరిజనులను కించపరిచేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు.
సారాతోనే గిరిజనులు బాగుపడ్డారని అనిరుధ్రెడ్డి మాట్లాడటం గిరిజనులపై ఆయనకు ఉన్న అవగాహనారాహిత్యం, వ్యతిరేకతను స్పష్టంగా తెలియచేస్తుందని పేర్కొన్నారు. అనిరుధ్ తన వ్యాఖ్యలను తక్షణం ఉపసంహరించుకొని, గిరిజనులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. లేదంటే తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.