హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం (ఎస్టీపీపీ) అవలంబిస్తున్న పర్యావరణహిత చర్యలకు మరోసారి జాతీయస్థాయి గుర్తింపు లభించింది. విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని అత్యంత పొదుపుగా వాడుతున్నందుకు వాటర్ మేనేజ్మెంట్ అవార్డు, నీటిని రీసైకిల్ చేస్తూ పునర్వినియోగిస్తున్నందుకు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ ప్లాంట్ అవార్డులను సొంతం చేసుకున్నది. ముంబైకి చెందిన ప్రముఖ పర్యావరణ సంస్థ ఎన్విరో ఎక్స్లెన్స్ కౌన్సిల్ శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన సదస్సులో ఈ అవార్డులను ప్రదానం చేసింది. దక్షిణ భారతదేశంలోని 500 మెగావాట్లకన్న ఎక్కువ సామర్థ్యం కలిగిన 75కు పైగా థర్మల్ విద్యుత్ కేంద్రాల పనితీరును పరిశీలించిన అనంతరం ఎస్టీపీపీని రెండు అవార్డులకు ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్ర ఇంధన అవసరాలు తీర్చడంలోనే కాకుండా పర్యావరణహిత చర్యలతో దక్షణాది రాష్ర్టాల్లోని థర్మల్ కేంద్రాలకు ఎస్టీపీపీ ఆదర్శంగా నిలుస్తున్నదని నిర్వహకులు ప్రశంసించారు. జాతీయస్థాయి పురస్కారాలు లభించడంపై సంస్థ చైర్మన్, ఎండీ శ్రీధర్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన డైరెక్టర్ ఈ అండ్ ఎం సత్యనారాయణరావును, ఉద్యోగులను అభినందించారు. ఎస్టీపీపీ అధికారులు ఎస్కే సూర్, జేఎన్ సింగ్, చిన బస్విరెడ్డి తదితరులు ఈ కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.