ఎన్నో క్లిష్ట సమయాల్ని తట్టుకొని, వాణిజ్యపరంగా విజయవంతమైన ఎల్ఐసీలో వాటాల్ని తక్కువ విలువకే అమ్మడం శోచనీయం. అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ఒత్తిడికి తలొగ్గి, భారీ డిస్కౌంట్ ధరల్లో షేర్లను విక్రయించడం.. దేశంలో జరిగిన ప్రైవేటీకరణల్లో ఇది పెద్ద కుంభకోణం.
–పీపుల్స్ కమిషన్
న్యూఢిల్లీ, మే 3: బీమా దిగ్గజం లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్లో ప్రభుత్వం వాటా విక్రయించేందుకు తెస్తున్న ఐపీవో దాదాపు రూ. 54,000 కోట్ల భారీ కుంభకోణమంటూ పీపుల్స్ కమిషన్ ఆన్ ద పబ్లిక్ సెక్టార్ అండ్ పబ్లిక్ సర్వీసెస్ (పీసీపీఎస్పీఎస్) విరుచుకుపడింది. పెద్ద బీమా సంస్థలకు ఉండాల్సిన విలువతో ఎల్ఐసీ వాటా విక్రయిస్తే ప్రభుత్వానికి రూ. 74 వేల కోట్లకు పైగా సమకూరేదని, ఇప్పుడు విలువ తగ్గించి వాటాను అమ్ముతున్నందున రూ.21 వేల కోట్లే వస్తాయని కమిషన్ వివరించింది. ఇలా రూ.53 వేల కోట్ల తక్కువ విలువకు అమ్మడం..ప్రభుత్వం పాల్పడ్డ కుంభకోణమేనని తీవ్రంగా విమర్శించింది.
ఖజానాకు అమితనష్టం కల్గించే ఈ ఐపీవోను నిలుపుచేయాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. కేంద్ర ఆర్థిక వ్యవహారాల మాజీ కార్యదర్శి ఈఏఎస్ శర్మ, జేఎన్యూ ప్రొఫెసర్ ఎమరిటస్ డాక్టర్ ప్రభాత్ పట్నాయక్, ప్రణాళికా సంఘం మాజీ సభ్యుడు ఎస్పీ శుక్లా, కేరళ మాజీ ఆర్థిక మంత్రి థామస్ ఇసాక్ తదితరుల సంతకాలతో పీసీపీఎస్పీఎస్ తాజాగా ఒక నోట్ విడుదల చేస్తూ ఆదాయం పెంచుకోవడానికి ఇతర మార్గాలున్నా, ఎన్నో క్లిష్ట సమయాల్ని తట్టుకుని, వాణిజ్యపరంగా విజయవంతమైన ఎల్ఐసీలో వాటాల్ని తక్కువ విలువకే అమ్మడాన్ని తప్పుపట్టింది.
అంతర్జాతీయ ఇన్వెస్టర్ల ఒత్తిడికి తలొగ్గి, భారీ డిస్కౌంట్ ధరల్లో షేర్లను విక్రయించడం..దేశంలో జరిగిన ప్రైవేటీకరణల్లో ఇది పెద్ద కుంభకోణమని తీవ్రంగా ఆరోపించింది. 3.5 శాతం వాటాల్ని రూ. 21,000 కోట్లకు విక్రయించే లక్ష్యంతో ఎల్ఐసీ పబ్లిక్ ఆఫర్ మే 4న ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఇంత తక్కువ విలువకు షేర్లను విక్రయించడంతో ప్రభుత్వ ఖజానాకు నష్టం వేల కోట్లలో ఉంటుందని పీసీపీఎస్ఎస్ విశ్లేషించింది.
గ్లోబల్ ఇన్వెస్టర్లకు జీ హుజూర్
ఎల్ఐసీ ఐపీవోకు ధరను నిర్ణయించిన విధానం చూస్తే గ్లోబల్ ఇన్వెస్టర్ల ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందని స్పష్టమైపోతున్నదని పీపుల్స్ కమిషన్ ఆరోపించింది. ఉక్రెయిన్లో యుద్ధాన్ని, ప్రపంచ మార్కెట్ల ఒడిదుడుకుల్ని సాకుగా చూపిస్తున్న విదేశీ ఇన్వెస్టర్లకు లొంగిపోయే బదులు, పబ్లిక్ ఆఫర్ జారీకి తగిన తరుణం వచ్చేంతవరకూ ఎందుకు వేచిచూడకూడదంటూ ప్రశ్నించింది. ఇది..ఎల్ఐసీ దిగ్గజ సంస్థగా రూపొందడానికి ముఖ్యకారకులైన పాలసీదారులను వంచించడమేనని కమిషన్ విమర్శించింది. విలువ నిర్ధారణలో కుంభకోణం చోటుచేసుకున్నందున ఈ ఐపీవోను నిలుపుచేసేందుకు తక్షణమే కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. వాటా విక్రయాన్ని వ్యతిరేకిస్తున్న ఎల్ఐసీ ఉద్యోగుల యూనియన్లకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
రెండు నెలల్లోనే విలువ ఎందుకు తగ్గించారు
‘ఎల్ఐసీ విలువ రూ.12-14 లక్షల కోట్లని ఫిబ్రవరిలో చెప్పిన కేంద్ర ప్రభుత్వం కేవలం రెండు నెలల్లోనే రూ.6 లక్షల కోట్లకు ఎందుకు తగ్గించింది? 30 కోట్ల పాలసీదారులకు ఇది తీరని నష్టం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంతో ఫైనాన్షియల్ మార్కెట్ల ఒడిదుడుకులు, దేశీ ఆర్థిక వ్యవస్థ మందగమనం నడుమ ఎల్ఐసీ షేర్లను అమ్మడమెందుకు? సంస్థ ఎంబెడెడ్ విలువను, ఆఫర్ ధరల శ్రేణిని తగ్గించడంతో ప్రభుత్వ ఖజానాకు రూ. 30,000 కోట్ల నష్టం. విలువ ఎందుకు తగ్గించాల్సివచ్చిందో ప్రభుత్వం సమాధానం చెప్పాలి’
–రణదీప్ సుర్జేవాలా, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి