హైదరాబాద్, మే 12 (నమస్తే తెలంగాణ): బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర కాస్తా ‘పైసా వసూల్ యాత్ర’గా మారిందని బీజేపీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి చుట్టూ ఇప్పుడొక కోటరీ ఏర్పడిందని, ఇతర నాయకులెవరినీ నేరుగా బండి సంజయ్తో మాట్లాడకుండా అడ్డుకొంటున్నారని చెప్పుకొంటున్నారు. పైగా వారు మధ్యవర్తుల అవతారం ఎత్తి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని రియల్టర్లు, బిల్డర్లు, పార్టీ టిక్కెట్లు ఆశించేవారికి నేరుగా ఫోన్లు చేస్తున్నారని ‘ఒకసారి రండి.. మాట్లాడుకుందాం’ అని పిలుస్తున్నారని తెలిసింది. వారికి టిక్కెట్ ఆశ చూపి ‘ఎంత ఇవ్వగలరు? ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టగలరు?’ అని నిర్మొహమాటంగా అడుగుతున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ పరిణామాలతో పార్టీ పరువు పోతున్నదని ఇతర కీలక నేతలు తలలు పట్టుకుంటున్నట్టు తెలిసింది. కోటరీ వ్యవహారం, పార్టీకి జరుగుతున్న నష్టంపై బండి సంజయ్కి వివరిద్దామన్నా, ఆయన వినే పరిస్థితిలో లేరని చెప్తున్నారు.
టిక్కెట్లు ఎలా హామీ ఇస్తారు?
బండి సంజయ్తోపాటు పార్టీలోని ఇతర కీలక నేతలైన ధర్మపురి అర్వింద్, ఈటల రాజేందర్, ఇతర ఎమ్మెల్యేలు తమ సన్నిహితులకు, తమ ప్రాంతంలోని బడాబాబులకు టిక్కెట్లు ఇప్పిస్తామని హామీలు ఇస్తున్నట్టు గతంలో తీవ్రంగా ప్రచారం జరిగింది. ముఖ్యంగా ఈటల రాజేందర్ జిల్లాల పర్యటన సందర్భంగా ఈ అంశంపై తీవ్ర చర్చ జరిగింది. దీంతో ఓ సందర్భంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. టిక్కెట్లన్నీ అధిష్ఠానమే నిర్ణయిస్తుందని, ఎవరు హామీ ఇచ్చినా చెల్లదని ప్రకటించాల్సి వచ్చింది. అలాంటిది ఇప్పుడు బండి సంజయ్ వర్గం ఎలా హామీ ఇస్తుందని నేతలు ప్రశ్నిస్తున్నారు. మధ్యవర్తి వర్గం ఇక్కడితోనే ఆగడం లేదని, కొత్తగా పార్టీలో చేరిన తమ వర్గీయులను అందలం ఎక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వాపోతున్నారు.