హైదరాబాద్, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ): సైబర్ నేరగాళ్లు రోజుకో రూపంలో ప్రజలను మోసం చేస్తూనే ఉన్నారు. తాజాగా దేశ స్వాతంత్య్ర వజ్రోత్సవాల వేళ క్యాష్ బ్యాక్ ఆఫర్లు.. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్లు అంటూ వల వేస్తున్నారు. ‘రూ.1857, రూ.1947, రూ.1997, రూ.2022..’ ఇలా స్వాతంత్య్ర చరిత్రలో ముఖ్యమైన సంవత్సరాలను కోట్ చేస్తూ అంత విలువైన సొమ్మును మీరు క్యాష్ బ్యాక్గా గెలుచుకొన్నారని కొన్ని ఫిషింగ్ లింక్లు పంపుతున్నారు.
వీటిపై క్లిక్ చేసి మీ బ్యాంక్ వివరాలు నమోదు చేస్తే మీ ఖాతాలో నగదు జమ అవుతుందని ఈ మెయిల్స్, మెసేజ్లు పంపుతున్నారు. ఇందుకు ప్రముఖ కంపెనీల లోగోలు జత చేస్తున్నారు. ఆ లింక్లపై క్లిక్ చేయగానే సైబర్ నేరగాళ్లు మన ఫోన్లలోకి మాల్వేర్ను పంపుతున్నారు. లింక్పై క్లిక్ చేసిన తర్వాత ఎనీ డెస్క్ వంటి రిమోట్ యాప్స్ను డౌన్లోడ్ చేసుకోవాలని సూచిస్తున్నారు. అలా నమ్మిన వారి నుంచి ఓటీపీలు సేకరించి డబ్బులు కొట్టేస్తున్నట్టు సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు.