హైదరాబాద్, జనవరి 21 (నమస్తే తెలంగాణ): దళితుల ఆర్థిక అభ్యున్నతి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదని ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పష్టం చేశారు. ఎంపికైన లబ్ధిదారులకు యూనిట్ల వారీగా నిధులు జమ అవుతాయని చెప్పారు. సీఎం కేసీఆర్ మార్గదర్శకాల మేరకు త్వరలో విధి విధానాలు వెలువడుతాయని, కొందరు కోర్టుకు వెళ్లడం వల్లే పథకం అమలులో జాప్యం జరుగుతున్నట్టు మంత్రి వివరించారు.
ఆలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ను శనివారం హైదరాబాద్లో మంత్రి కొప్పుల ఆవిషరించి మాట్లాడారు. దళితబంధు పథకం ఓ మహాయజ్ఞంలా సాగుతున్నదని, నిబంధనల మేరకే లబ్ధిదారులను ఎంపిక చేస్తారని అన్నారు. ఒకేసారి అందరికీ దళితబంధు సాయం అందదని, విడతల వారీగా వర్తింపజేస్తారని వివరించారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపడమే పథకం లక్ష్యమని, దీనిపై వస్తున్న వదంతులను నమ్మవద్దని సూచించారు. దళితబంధు పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేయాలని ఇటీవల ఖమ్మం బీఆర్ఎస్ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారని గుర్తు చేశారు.
ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 38 వేలమందికిపైగా లబ్ధిదారులను గుర్తించి, రూ.3,840 కోట్లను వారి ఖాతాల్లో జమచేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో అలిండియా షెడ్యూల్డ్ క్యాస్ట్ రైట్స్ ప్రొటెక్షన్ సొసైటీ జాతీయ గౌరవాధ్యక్షుడు ముత్తన్న, సెక్రటరీ జనరల్ బాలకృష్ణ, జగన్నాథం, శిరీష, కల్యాణ్, సుబ్బారావు, ప్రభాకర్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.