హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ): కిరాయి బిల్లులు ఇవ్వడానికి రూ.40 వేల లంచం తీసుకుంటూ రంగారెడ్డి జిల్లా ఎస్సీ అభివృద్ధిశాఖ సూపరింటెండెంట్ కే రామ్మోహన్, ఆఫీస్ సబార్డినేట్ షకీల్ అహ్మద్ గురువారం ఏసీబీకి చిక్కా రు. ఏసీబీ అధికారుల కథనం ప్రకారం.. మన్సూరాబాద్లో ఉండే రిటైర్డు లెక్చరర్ మీలా సోమయ్య తన భవనాల కిరాయి బిల్లుల కోసం జిల్లా ఎస్సీ కార్యాలయంలో సంప్రదించారు.
కార్యాలయ సూపరింటెండెంట్, అతడి సబార్డినేట్లు తమ నుంచి ఫైల్ సంబంధిత సెక్షన్కు వెళ్లాలంటే రూ.40 వేల లంచం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనిపై సోమయ్య ఏసీబీ అధికారులను సంప్రదించారు. గురువారం కార్యాలయ ఆవరణలో బాధితుడు వారికి రూ.40 వేలు ఇచ్చారు. వెంటనే ఏసీబీ అధికారులు.. రామ్మోహన్, షకీల్ను పట్టుకొన్నారు. డబ్బులు స్వాధీనం చేసుకొని వారిని అదుపులోకి తీసుకొన్నారు. వారిని హైదరాబాద్లోని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరుచగా.. కోర్టు రిమాండ్ విధించింది.