హుజూరాబాద్ టౌన్, సెప్టెంబర్ 2: తాను గెలిస్తే సీఎం కేసీఆర్ రాజీనామా చేయాలని అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్న బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్.. గెల్లు శ్రీనివాస్ గెలుస్తే ప్రధాని మోదీ రాజీనామా చేస్తారా? అని ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్ సూటిగా ప్రశ్నించారు. గురువారం ఆయన హుజూరాబాద్ టీఆర్ఎస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. హుజూరాబాద్ అభివృద్ధిపై చర్చకు రావాలని ఈటల సవాల్ను స్వీకరిస్తున్నానని ప్రకటించారు. ‘నీ స్థాయికి మంత్రి హరీశ్రావు అవసరం లేదని, స్థానికులమైన మేం సరిపోతాం’ అని స్పష్టం చేశారు. ఈటల హయాంలో ఈ ప్రాంతంలో అభివృద్ధి జరగలేదని హరీశ్రావు అన్నది నూటికి నూరు శాతం వాస్తవమని చెప్పారు. గెల్లు శ్రీనివాస్ వయస్సు చిన్నదని, తనకు పోటేకాదని ప్రగల్భాలు పలుకుతున్నాడన్నా రు. ‘నువ్వు ముద్దసాని దామోదర్పై పోటీ చేసినప్పుడు నీ వయసెంతో చెప్పాలి’ అని ఆయన ఈటలను ప్రశ్నించారు. ఓటమి భయంతో ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నాడని నిప్పులు చెరిగారు. అభివృద్ధిని విస్మరించి అబద్ధాలు చెబుతున్న ఈటలకు హుజూరాబాద్ ప్రజలు ఉప ఎన్నికలో కర్రుకాల్చి వాతపెడుతారని బండ శ్రీనివాస్ హెచ్చరించారు.