నాగర్ కర్నూల్ : జిల్లాలోని కుమ్మెర బాధితులకు (Kummera victims ) అండగా నిలిచి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య( Chairman Bakki Venkataiah) జిల్లా పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులను సహించబోమని వెల్లడించారు. బుధవారం కలెక్టరేట్లో కుమ్మెర బాధితులను కమిషన్ సభ్యుడు శంకర్తో కలసి పరామర్శించారు.
అనంతరం అధికారులతో నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, జిల్లా ఎస్పీ డాక్టర్ సంగ్రామ్ సింగ్ జీ పాటిల్ , ఇతర పోలీస్ అధికారులతో కలిసి ఘటనకు సంబంధించిన పూర్వాపరాలు, కేసు నమోదు ప్రక్రియ, బాధ్యులపై తీసుకుంటున్న చర్యలు, బాధితులకు అందిస్తున్న వైద్య సహాయం వంటి అంశాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారి తల్లిదండ్రులు గణేష్, మౌనిక కుటుంబ సభ్యులతో ఘటన పూర్వాపరాలను అడిగి తెలుసుకున్నారు.
బాధితులకు అన్ని విధాలుగా హామీ ఉంటామని, నిందితులకు కఠిన శిక్షలు అమలు జరిగే వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ బాధ్యతల పక్షాన నిలుస్తుందని, బాధితులకు భరోసా ఇచ్చారు. దర్యాప్తును వేగవంతం చేసి, బాధితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని ఆదేశించారు.
1989 చట్టాన్ని కట్టుదిట్టంగా అమలు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమాజంలో సమానత్వం, భద్రత కల్పించడం ప్రభుత్వ ప్రాధాన్యత అని, ఎస్సీ, ఎస్టీల హక్కులను రక్షించడంలో ఎలాంటి రాజీ ఉండదని స్పష్టం చేశారు. కుమ్మెర ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి దామోదర్ రాజనర్సింహతో మాట్లాడి బాధ్యతలకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని, కుమ్మెర కేసును త్వరగా పరిష్కరించేలా ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి, బాధితులకు సత్వర న్యాయం అందించే దిశగా కమిషన్ కృషి చేస్తుందని వివరించారు.
కుమ్మెర బాధితులకు తక్షణ ఖర్చుల నిమిత్తం గణేష్, మౌనికకు లక్ష రూపాయల చెక్కును అందజేశారు. వచ్చే మూడు నెలల పాటు వారికి నిత్యవసర సరుకులు నిరంతరంగా అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆయన ఆదేశించారు. నిందితులపై హత్య కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ కేసు బుక్ చేయాలని జిల్లా ఎస్పీకి సూచించారు. బాధ్యులు కుమ్మర గ్రామంలో వెళ్లడానికి ప్రాణహాని ఉంటుందని వారు భయంతో ఉన్నారని, నాగర్ కర్నూల్ లోని డబల్ బెడ్ రూమ్ ఏర్పాటు చేసి గణేష్ కు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.