SBI | హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 23 (నమస్తే తెలంగాణ): ఈఎంఐలు చెల్లిస్తున్నా వాహనాన్ని స్వాధీనం చేసుకున్న ఘటనలో ఎస్బీఐకి రూ.50 వేల జరిమానాతో పాటు రూ.20 వేల కోర్టు ఖర్చులు చెల్లించాలని హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 ఆదేశించింది. స్వాధీనం చేసుకున్న వాహన విలువ ప్రకారం రూ.2 లక్షలు వినియోగదారుడికి చెల్లించాలని, వాహన కొనుగోలుదారు లోన్ ఖాతాను మూసివేయాలని బ్యాంకును నిర్దేశించింది. సిబిల్లో ప్రతికూల అంశాలను కూడా సరిచేయాలని కమిషన్ అధ్యక్షురాలు బీ ఉమావెంకట సుబ్బలక్ష్మి, సభ్యులు సీ లక్ష్మీప్రసన్న, ఆర్ నారాయణరెడ్డితో కూడిన బెంచ్ సూచించింది.
శంషాబాద్లోని రుద్రకాలనీకి చెందిన శ్రీగిరి స్మిత 2016లో ఎస్బీఐ నుంచి వాహన లోన్ తీసుకొన్నారు. అప్పటి నుంచి నెలనెలా ఈఎంఐ చెల్లిస్తున్నారు. తన సేవింగ్ బ్యాంక్ ఖాతా (సౌత్ ఇండియన్ బ్యాంక్) శంషాబాద్ బ్రాంచ్ నుంచి ఈఎంఐ చెల్లిస్తున్నారు. 2018 డిసెంబర్లో ఈఎంఐకి సరిపడా నిల్వ ఉన్నా సాంకేతిక సమస్య వల్ల డిడక్ట్ కాలేదు. దీంతో చెల్లింపులు చేయలేదని ఎస్బీఐ ఏజెంట్లు వాహనాన్ని తీసుకెళ్లారు. గర్భవతి అని చూడకుండా తనపట్ల నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించారని బాధితురాలు వినియోగదారుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. రికవరీ ఏజెంట్లు నిబంధనలు ఉల్లంఘించారని కమిషన్ మండిపడుతూ, బాధితురాలికి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశించింది.