హైదరాబాద్, జనవరి 8 (నమస్తే తెలంగాణ): తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రణయ కలహోత్సవం ఆదివారం వేడుకగా జరిగింది. ప్రతి ఏటా వైకుంఠ ఏకాదశి తర్వాత ఆరో రోజు, అధ్యయనోత్సవంలో 17వ రోజు తిరుమలలో ప్రణయ కలహోత్సవం నిర్వహించడం ఆనవాయితీ. స్వామి, దేవేరులు పూలచెండ్లతో కలహించుకోవడం ఈ ఉత్సవం ప్రత్యేకత. మలయప్పస్వామి పల్లకీ ఎక్కి మహాప్రదక్షిణ మార్గంలో స్వామి పుష్కరిణి వద్దకు చేరుకున్నారు. ఇంతలో అమ్మవార్లు చెరొక పల్లకీపై అప్రదక్షిణంగా స్వామికి ఎదురుగా వచ్చి నిలుచున్నారు.
పురాణ పఠనం జరుగుతుండగా అమ్మవార్ల తరపున జియ్యంగార్లు పూలచెండ్లతో స్వామిని మూడుసార్లు తాడించారు. శ్రీనివాసుడు బెదిరినట్లుగా నటించి.. తానేమీ తప్పు చేయలేదని అమ్మవార్లను ప్రాధేయపడ్డారు. అనంతరం అమ్మవార్లు శాంతించి స్వామికి ఇరువైపులా చేరి కర్పూరహారతులు అందుకుని ఆలయానికి చేరుకున్నారు. అనంతరం ఆస్థానం నిర్వహించారు. ఉత్సవంలో భాగంగా శ్రీనమ్మాళ్వార్ రచించిన ఆళ్వార్ దివ్య ప్రబంధంలోని పాసురాలను నిందాస్తుతి శైలిలో అర్చకులు పారాయణ చేశారు. కార్యక్రమంలో పెద్దజీయర్స్వామి, చిన్నజీయర్స్వామితోపాటు ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీకి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూ.25 లక్షల విలువైన అంబులెన్స్ను విరాళంగా అందజేసింది. ముందుగా శ్రీవారి ఆలయం ఎదుట అంబులెన్స్కు వాహన పూజలు నిర్వహించారు. అనంతరం బ్యాంకు చైర్మన్ దినేశ్కుమార్ అంబులెన్స్ తాళాలను టీటీడీ ఈవో ధర్మారెడ్డికి అందజేశారు. ఈ అంబులెన్స్ను స్విమ్స్ రోగుల సేవల కోసం వినియోగించనున్నారు.