Minister Satyavathi | ‘పోడు రైతులకు హక్కులు కల్పించేందుకు పోడు హక్కుల చట్టం ఏర్పాటు చేశారు. 75 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్ర ఇప్పటివరకు గత ప్రభుత్వాలు 3లక్షల ఎకరాలకు పట్టాల చేశాయి. కానీ, సీఎం కేసీఆర్ 9ఏళ్ల పరిపాలనలోనే ఒకే రోజు 4.60లక్షల ఎకరాల పోడు పట్టాలను గిరిజనులకు అందించారు’ అని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. సమ్మక్క సారక్క తాడ్వాయి మండలం మేడారం గ్రామంలో కలెక్టర్ ఎస్ క్రిష్ణ ఆదిత్య అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ములుగు జిల్లాకు చెందిన పోడు సాగుదారులకు హక్కుపత్రాలు, జిల్లాలో ప్రభుత్వ నిషేధిత సంస్థల్లో పని చేస్తూ లొంగిపోయిన కుటుంబాలకు ఇండ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
మొదట సేవాలాల్, కుమ్రంభీం చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జడ్పీ చైర్పర్సన్ బడే నాగజ్యోతి, రెడ్కో చైర్మన్ ఏరువ సతీశ్రెడ్డి, అదనపు కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఐటీడీఏ పీవో అంకిత్, ఓఎస్డీ అశోకుమార్, గ్రంథాలయ చైర్మన్ గోవింద్ నాయక్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్ల బుచ్చయ్య, మహబూబాబాద్ మాజీ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్తో కలిసి పట్టాలు పంపిణీ చేశారు. అనంతరం మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ రాష్ట్రంలోని గిరిజనుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం.. పోడు భూములకు హక్కుపత్రాలను అందిస్తూ రైతుబంధు, రైతుబీమా పథకాలను వర్తింపజేసే కార్యక్రమాన్ని చేపట్టారన్నారు.
రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టిన పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని చూస్తుంటే మేడారం మహాజాతరను తలపిస్తున్నదని అన్నారు. అర్హులైన ప్రతి సాగుదానికి హక్కు పత్రం అందాలనే ప్రభుత్వ ధ్యేయమన్నారు. గిరిజన రైతులకు పోడు పట్టాలను అందించడంతోపాటు అర్హులైన గిరిజనేతర రైతులకు సైతం పట్టాలు కచ్చితంగా ఇవ్వాలని ప్రభుత్వానికి ములుగు కలెక్టర్ క్రిష్ణ ఆదిత్య సూచించారంటూ కొనియాడారు. ప్రభుత్వం నిర్ణయంతో గిరిజనులకు ఎన్నో ఇబ్బందులు తప్పాయన్నారు. సీఎం కేసీఆర్ చిత్తశుద్ధితో తీసుకున్న నిర్ణయాల కారణంగానే పట్టాల పంపిణీ జరుగుతోందని చెప్పారు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కాని విధంగా ఒకే సమయంలో తెలంగాణలో 1.50లక్షల కుటుంబాలకు లబ్ధికలిగేలా 4.60లక్షల ఎకరాలకు హక్కుపత్రాలను అందించారని మంత్రి వివరించారు.