హైదరాబాద్, సెప్టెంబర్ 17 (నమస్తే తెలంగాణ): తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్ సతీశ్చంద్ర శర్మను నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేసినట్టు సమాచారం. ప్రస్తుతం జస్టిస్ శర్మ కర్ణాటక హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరిస్తున్నారు. ఇటీవలి వరకూ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ హిమాకోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులైన విషయం తెలిసిందే. దీంతో తెలంగాణ హైకోర్టు తదుపరి సీజేగా జస్టిస్ శర్మను నియమించాలని కొలీజియం సిఫారసు చేసినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేంద్రం ఈ సిఫారసులను ఆమోదించి, రాష్ట్రపతికి పంపిస్తుంది. ఆయన ఆమోదం పొంది, కేంద్ర న్యాయశాఖ గెజిట్ను ప్రచురించాక జస్టిస్ శర్మ తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేస్తారు. దీంతో రాష్ట్ర హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 12కు పెరుగుతుంది. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కి పెంచుతూ సుప్రీంకోర్టు ఇటీవల నిర్ణయించిన విషయం తెలిసిందే. వీరిలో 28 మందిని బార్ నుంచి, మిగిలిన 14 మందిని జ్యుడిషియల్ సర్వీసెస్ నుంచి ఎంపిక చేస్తారు. న్యాయమూర్తుల సంఖ్య పెంపుదల నిర్ణయానికి అనుగుణంగా సుప్రీంకోర్టు కొలీజియం ఆయా కోటాల నుంచి పేర్లను సిఫారసు చేసినట్లు సమాచారం.
జస్టిస్ శర్మ తెలంగాణ హైకోర్టు సీజేగా బాధ్యతలు స్వీకరిస్తే మూడేండ్ల కాలంలో ఈ పదవిని చేపట్టిన నాలుగో వ్యక్తి అవుతారు. 2019 జనవరి 1న ఏర్పాటైన తెలంగాణ హైకోర్టుకు తొలి ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ టీబీ రాధాకృష్ణన్, రెండో సీజేగా జస్టిస్ ఆర్ఎస్ చౌహాన్, మూడో సీజేగా జస్టిస్ హిమాకోహ్లీ వ్యవహరించిన విషయం విదితమే. జస్టిస్ హిమాకోహ్లీ పదోన్నతిపై సుప్రీకోర్టు న్యాయమూర్తిగా వెళ్లడం తో ప్రస్తుతం తెలంగాణ హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావు పనిచేస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణ సహా ఎనిమిది రాష్ర్టాల హైకోర్టులకు ప్రధాన న్యాయమూర్తులు లేకపోవడంతో ఈ పదవుల భర్తీపై సుప్రీంకోర్టు కొలీజియం దృష్టి కేంద్రీకరించింది. దీనిలో భాగంగా అలహాబాద్ హైకోర్టు సీజేగా జస్టిస్ రాజేశ్బిందాల్, కలకత్తా హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రకాశ్ శ్రీవాస్తవ, ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్కుమార్ మిశ్రా, కర్ణాటక హైకోర్టు సీజేగా జస్టిస్ రీతూరాజ్ అవస్థీ, మేఘాలయ హైకోర్టు సీజేగా జస్టిస్ రంజిత్ వీ మోర్, గుజరాత్ హైకోర్టు సీజేగా జస్టిస్ అరవింద్ కుమార్, మధ్యప్రదేశ్ హైకోర్టు సీజేగా జస్టిస్ ఆర్వీ మలిమత్ను నియమించాలని కేంద్ర న్యాయ శాఖకు సిఫా ర్సు చేసినట్లు అభిజ్ఞ వర్గాలు తెలిపాయి. అయిదుగురు వివిధ హైకోర్టుల సీజేలు, 28 మంది జడ్జిల బదిలీకి కొలీజియం సిఫారసు చేసినట్టు తెలిపాయి. తెలంగాణ హైకోర్టు తాతాలిక ప్ర ధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న జస్టిస్ ఎమ్మెస్ రామచంద్రరావును పంజాబ్-హర్యానా హైకోర్టుకు బదిలీ చేయాలని సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసినట్టు సమాచారం. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచే స్తున్న జస్టిస్ టీ అమర్నాథ్గౌడ్ను త్రిపుర హైకోర్టు న్యాయమూర్తిగా బదిలీ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తున్నది.
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో 1961 నవంబర్ 30న పుట్టిన జస్టిస్ శర్మ.. విద్యార్థి దశలోనే పలు బంగారు పతకాలు సాధించారు. జస్టిస్ శర్మ తండ్రి డాక్టర్ బీఎన్ శర్మ వ్యవసాయం రంగ నిపుణడు. జస్టిస్ శర్మ తల్లి శాంతిశర్మ మహారాణి లక్ష్మీబాయ్ హయ్యర్ సెకండరీ సూల్ ప్రిన్సిపాల్గా, జబల్పూర్ జిల్లా విద్యాధికారిణిగా పనిచేశారు. జస్టిస్ శర్మ హరిసింగ్గౌర్ విశ్వవిద్యాలయంలో 1984లో ఎల్ఎల్బీ పూర్తిచేశారు. ఎల్ఎల్బీలో 3 గోల్డ్మెడల్స్ సాధించారు.
తొలుత మధ్యప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా, న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ శర్మ.. 1993 మే 28న కేంద్ర ప్రభుత్వ అదనపు కౌన్సెల్గా, 2004 జూన్ 28న కేంద్ర ప్రభుత్వ సీనియర్ ప్యానల్ కౌన్సెల్గా నియమితులయ్యారు. 2008 జనవరి 18న మధ్యప్రదేశ్ హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులైన జస్టిస్ శర్మ.. 2010 జనవరి 15న శాశ్వత న్యాయమూర్తి అయ్యారు. ఈ ఏడాది జనవరి 4న కర్ణాటక హైకోర్టుకు బదిలీ అయిన జస్టిస్ శర్మ.. ఆగస్టు 31న కర్ణాటక హైకోర్టు తాతాలిక ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. పలు వర్సిటీల్లో ఎన్నో ప్రసంగాల ద్వారా ఖ్యాతి పొందిన జస్టిస్ శర్మకు భోపాల్లోని నేషనల్ లా వర్సిటీతో ఎంతో అనుబంధం ఉన్నది. ఆ యూనివర్సిటీకి సలహాదారుడిగా వ్యవహరించిన జస్టిస్ శర్మ.. అకడే పలు రిసెర్చ్ ఆర్టికల్స్ ప్రచురించారు.