నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, హైదరాబాద్: ‘ముఖం మీన పిడకలు గొట్టినట్టు ఫేస్బుక్ గోడల మీన ఒకటే తిట్లుర బై. గిదేం ముచ్చట? సూడుసూడని ఇప్పుడు బేరాలు పెడ్తిరి. అడ్డంగా దొరికి మునుగోడుల నన్ను ఓడగొట్టేట్టుండ్రు’ అనుకుంట రాజగోపాల్ చిందులేస్తుండు. ‘కూల్.. కూల్’ అంటూ ఇద్దరు ఎంపీలు భుజం మీద చెయ్యేసిన్రు. ‘ఎన్నికల్ని షరా మామూలే అనుకోవాలె. అయినా మనమేమన్నా గెలుస్తమని దిగినమా? ఏంది! నీ కాంట్రాక్ట్ నీకొచ్చె’ననుకో అంటూ సర్ది చెప్పిన్రు. ఓడిపోతే పరువు పోయేది నాదని గోపాలుడు గొనుగుతుంటే.. ‘సూడు గోపాల్’ అంటూ సంజయ్ దగ్గరికొచ్చిండు. ‘ఆ కేఏ పాల్ని సూడు.. క్యాడరు లేదు, లీడరూ లేడు. చూసి నేర్చుకో’మని నూరిపోసిన్రని మీమ్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నయ్ !
పట్టుబడ్డరని తెలిసిందో లేదో.. ‘అడ్డెడ్డె.. అడ్డంగా దొరికిపోయామే. ఇప్పుడేం జేయాలని క్యాష్ కౌంటర్ లీడర్లు ఆలోచిస్తుంటే.. కొను‘గోల్ మాల్’ లీడర్లలో ఒకరు ‘దొంగే దొంగ.. దొంగ’ అనాలని వాళ్ల లీడర్లు నేర్పిన విద్యని ఆచరణలో పెట్టిండు. అంతే అర్ధరాత్రే సోషల్ మీడియాలో బీజేపోళ్లు దొంగ ప్రచారం మొదలువెట్టారు. ‘అక్కడ డబ్బులెక్కడ దొరికినయ్.. కనపడ్డయా? అదంతా కేసీఆర్ డైరెక్షన్’ అంటూ వాట్సాప్ యూనివర్సిటీ రంగంలోకి దిగింది. ఇంతల్నే కవి ఉదయ మిత్ర ఫేస్బుక్ వాల్ మీన
‘కొనవలె నెవ్వరు జెప్పిన
కొననినంతనే వేగ పడక
బుకాయింప దగున్..
అధికారపు కిటుకు దెలిసిన
మనుజుడెపో..
రాజనీతి పరుడు తథ్యము సుమతీ’
అంటూ వచ్చిపడింది.
సోషల్ మీడియా అంటేనే సెటైర్ల వరద. దొరక్క దొరక్క దొరికితే వదిలిపెడ్తరా? ఫేస్బుక్, ట్విట్టర్, టెలిగ్రామ్, వాట్సాప్లో ఆటాడుకుంటున్నరు. ఈ మధ్యన ఆర్థిక మంత్రి నిర్మలమ్మ తగదునమ్మా అంటూ లోకల్ వ్యవహారాల్లో తలదూర్చింది. గిప్పుడా ముచ్చటని యాది జేస్తూ.. ‘ఇంకా నిర్మలమ్మ దృష్టికి రానట్టుంది. కొనుగోలు ముచ్చట.. లేకుంటే దీని మీద కూడా జీఎస్టీ అంటుండె’ అంటూ సుధీర్ కుమార్ తాండ్ర ఫేస్బుక్లో కడిగిండు. ‘ఏయ్ కలెక్టర్, ఢిల్లీ నుంచి పైసలు వచ్చినప్పుడు దాని మీద పెద్దాయన ఫొటో పెట్టాలా? లేదా?’ అని ఫేస్బుక్ల చురకేసిండు నవీన్ఆచారి. ‘అక్కడికి పోలీసులు ఎలా వెళ్తారూ?’ అంటూ అర్ధరాత్రి బేరాలకు అడ్డుపడ్డ పోలీసులు మా స్వాతంత్య్రానికి అడ్డుపడ్డారన్నట్టు బాధపడ్డ కేంద్రమంత్రి కిషన్రెడ్డి మాటలు విన్నంక.. ‘ఎమ్మెల్యేలను అర్ధరాత్రి స్వేచ్ఛగా కొనగలిగిననాడే మనకి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్టు’ అని కేవీ కుర్మనాథ్ ఫేస్బుక్లో ఓదార్చారు. ఇక ట్విట్టరులో ‘వంద రూపాయలకు కూడా అమ్ముడుపోని ఈ సన్నాసులకు వంద కోట్లు ఎవరు ఇస్తారు?’ అంటూ కోమటిరెడ్డి రాజగోపాల్ ట్వీట్ చేసిండు. ఎమ్మటే ఆర్జే పాల్కి పడింది పంచ్! ట్విట్టర్లో ఆయన ఫాలోవర్ బారపాటి ప్రవీణ్ వెంటనే ‘మీ సన్యా(న్నా)సులే కొనటానికి వచ్చింది!’ అంటూ రిైప్లె ఇచ్చిండు. మునుగోడులో హ్యాపీగా తిరుగుతూ ముద్దులు పెడుతున్న కేఏపాల్ సరసన జేరేందుకు ఇప్పుడు రాజగోపాల్ రెడీ కావాలి అని సోషల్మీడియాలో జ్యోతిషం చెప్పేస్తున్నారు. ఇట్ల సీరియస్గా మొదలైన చర్చ నవ్వులే నవ్వులన్నట్టుగా సాగిపోతున్నది.
‘నుదుట విభూతి పెయినిండా పితాంబరాలు చేస్తిమి బ్రోకరిజాలు’ అంటూ క్యాషాయ స్వాముల చిల్లర బేరాన్ని Subbaiah Vanapatla వెక్కిరించిండు. అయినా సిగ్గురాకపాయె. Narasimha Rao తన వాల్ మీదకు వచ్చి ‘యముడికి మొగుడు’ అంటూ పోస్ట్ పెట్టిండు. ఎవరీ యముడికి మొగుడని ఆలోచిస్తుండగా కేసీఆర్ టీవీల్లో కనిపించిండు!