హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): మన దేశంలో అత్యున్నత విద్యాసంస్థలుగా భాసిల్లుతున్న ఐఐటీలు అంతర్జాతీయంగానూ ఎంతో ఖ్యాతి పొందుతున్నాయి. ఇప్పటికే పలు దేశాల విద్యార్థులను ఆకర్షిస్తున్న ఐఐటీలు ఇప్పుడు వివిధ దేశాల్లో క్యాంపస్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నాయి. ఆఫ్రికా, యూరప్ దేశాల్లో జాయింట్ డిగ్రీ ప్రోగ్రామ్ల నిర్వహణకు శాటిలైట్ క్యాంపస్లను ఏర్పాటు చేయాలని వినతులు వచ్చినట్టు మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి వెల్లడించారు. అంతర్జాతీయ విద్యార్థుల కోసం ఎంటెక్ ప్రోగ్రామ్లను ప్రవేశపెట్టనున్నట్టు చెప్పిన ఆయన.. ఖాట్మండు యూనివర్సిటీలో ఎనర్జీ సిస్టమ్స్ కోర్సును ప్రారంభించినట్టు తెలిపారు. ‘
ఆస్క్ ఐఐటీఎం’ పేరుతో శనివారం మాదాపూర్లోని టీహబ్-2లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రొఫెసర్ కామకోటి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ.. ఎన్ఈపీ-2020 ప్రకారం అన్ని బ్రాంచీల్లో ఇంటర్ డిసిప్లినరీ కోర్సులు అందుబాటులోకి రానున్నట్టు చెప్పారు. ఐఐటీల్లో ఇప్పటికే పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయని, వీటికి తోడుగా రానున్న ఐదేండ్లల్లో మరో 20 కోర్సులను ప్రవేశపెట్టనున్నామని తెలిపారు. రానున్న రోజుల్లో సివిల్, మెకానికల్ ఇంజినీర్లకు డిమాండ్ మరింత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. విద్యార్థులు సైన్స్లో ముఖ్యాంశాల (ఫౌండేషన్ సైన్స్)పై అవగాహన పెంచుకోవాలని సూచించారు.
వచ్చే ఏడాది మెడికల్ టెక్నాలజీ కోర్సు
సాంకేతిక, వైద్య రంగాలను అనుసంధానిస్తూ మద్రాస్ ఐఐటీలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి కొత్తగా మెడికల్ టెక్నాలజీ కోర్సును ప్రవేశపెట్టనున్నట్టు ప్రొఫెసర్ కామకోటి తెలిపారు. ఎంబీబీఎస్, ఎండీ లాంటి కోర్సులు పూర్తిచేసినవారికి మెడికల్ టెక్నాలజీలో పీహెచ్డీ చేసుకునే అవకాశం కల్పించబోతున్నట్టు ప్రొఫెసర్ కామకోటి వెల్లడించారు. మెడికల్ టెక్నాలజీ కోర్సులను ప్రవేశపెట్టేందుకు గౌహతి, కాన్పూర్ ఐఐటీలు సైతం కసరత్తు చేస్తున్నట్టు చెప్పారు.
టీహబ్తో భాగస్వామ్యం
హైదరాబాద్లో నిర్మించిన టీహబ్, ఇక్కడి వాతావరణం బాగున్నదని ప్రొఫెసర్ కామకోటి ప్రశంసించారు. టీహబ్తో భాగస్వామ్యానికి చర్చలు జరుపుతున్నట్టు వెల్లడించారు. తొలి విడత చర్చలు శనివారం పూర్తయ్యాయని, తమ భాగస్వామ్యంపై త్వరలోనే పూర్తిస్పష్టత వస్తుందని చెప్పారు.
17న వర్చువల్ విజిట్
జేఈఈ అడ్వాన్స్డ్ విద్యార్థుల కోసం ఈ నెల 17న ‘ఏ డే ఎట్ ఐఐటీఎం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు ప్రొఫెసర్ కామకోటి వెల్లడించారు. ఆ రోజు విద్యార్థులు వర్చువల్గా క్యాంపస్ను, డిపార్ట్మెంట్లను సందర్శించవచ్చన్నారు. మద్రాస్ ఐఐటీ ప్రత్యేకతలు, కోర్సులు, ప్లేస్మెంట్స్, వసతుల గురించి తెలుసుకోవాలనుకొనేవారు ‘ఆస్క్ ఐఐటీఎం’ వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
కోర్సు ఏదైనా ఎంజాయ్ చేస్తూ చదవాలి
ఐఐటీల్లో కఠినంగా ఉండే కోర్సుల వల్ల విద్యార్థులపై సహజంగానే ఒత్తిడి ఉంటుందని, దీన్ని అధిగమించాలంటే ఎంజాయ్ చేస్తూ చదవాలని ప్రొఫెసర్ కామకోటి సూచించారు. ఒత్తిడి నుంచి విద్యార్థులు బయటపడాలంటే తల్లిదండ్రుల వైఖరిలో మార్పు రావాలన్నారు. విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించేందుకు మద్రాస్ ఐఐటీలో ‘సాథీ’ పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనిలో భాగంగా ఒక్కో విద్యార్థికి ఒక్కరు లేదా ఇద్దరు సీనియర్ విద్యార్థులను అటాచ్ చేసి సమస్యలను దూరం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు.