హైదరాబాద్, జూలై 28 (నమస్తే తెలంగాణ): గౌడ ఆత్మ గౌరవ భవన నిర్మాణం, నిర్వహణ కోసం ‘శ్రీ సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ ట్రస్ట్’ను ఏర్పాటు చేయనున్నట్టు ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మంత్రి అధ్యక్షతన గురువారం హైదరాబాద్లో రాష్ట్రంలోని గౌడ సంఘాల సమన్వయ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ట్రస్ట్ ఏర్పాటు చేయాలని గౌడ సంఘాలు, గౌడ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉన్నతాధికారులు, మేధావులు ఏకగ్రీవ తీర్మానం చేశారని, తనను చైర్మన్గా ప్రతిపాదించారని మంత్రి పేర్కొన్నారు. ఇందులో గౌడ సామాజిక వర్గానికి చెందిన మంత్రులు, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కులసంఘాల ప్రతినిధులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, మేధావులు సభ్యులుగా ఉంటారన్నారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్రంలోని అన్ని గౌడ సంఘాలను సమన్వయం చేసుకొని భవన నిర్మాణ శంకుస్థాపనకు కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. సమావేశంలో ఎమ్మెల్సీ గంగాధర్ గౌడ్, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్, ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, మాజీ ఎమ్మెల్సీలు బాలసాని లక్ష్మీనారాయణ, నాగపూరి రాజలింగంగౌడ్, బీసీ కమిషన్ సభ్యులు కే కిశోర్, మాజీ చైర్మన్లు రాజేశంగౌడ్, నాగేందర్గౌడ్, గౌడ సంఘాల ముఖ్య నేతలు పల్లె లక్ష్మణ్రావుగౌడ్, బాలగోని బాలరాజుగౌడ్, ప్రశాంత్గౌడ్, అంబాల నారాయణగౌడ్, వట్టికూటి రామారావుగౌడ్, సూదగోని హరిశంకర్గౌడ్, అమరవేణి నర్సాగౌడ్, గోపా అధ్యక్షులు రమేశ్గౌడ్, జైహింద్గౌడ్, అయిలి వెంకన్నగౌడ్, రాజయ్యగౌడ్, ఈతముల్లు ప్రసాద్, బత్తిని లతగౌడ్, పన్యాల మమతగౌడ్, జాజుల శ్రీనివాస్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.