ఇల్లందకుంట, డిసెంబర్ 5: భార్యను పం చాయితీకి పిలువట్లేదన్న కోపంతో మహిళా సర్పంచ్ కుటుంబంపై కక్ష పెంచుకున్న ఓ యువకుడు.. సర్పంచ్ అత్తను హత్య చేసి పరారయ్యాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం కనగర్తిలో సోమవారం కలకలం రేపింది. కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి, నిందితుడిని అరెస్ట్ చేశారు. హుజూరాబాద్ ఏసీపీ జీవన్రెడ్డి మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. కనగర్తికి చెందిన రామంచ కుమారస్వామికి వరంగల్ జిల్లా దామెర మండలం దేవాలకు చెందిన శ్రీలతతో 10 నెలల క్రితం వివాహం జరిగింది. కొన్ని రోజుల నుంచి తరచూ భార్యతో కుమారస్వామి గొడవపడేవాడు. వేధింపులు భరించలేక శ్రీలత పుట్టింటికి వెళ్లిపోయింది. 3 నెలల నుంచి కుమారస్వామి గ్రామ సర్పంచ్ రజిత ఇంటికెళ్లి తన భార్యను పంచాయితీకి పిలిపించాలని కోరు తున్నాడు.
సర్పంచ్, ఆమె భర్త వాసుదేవరెడ్డి పట్టించుకోలేదు. సర్పంచ్ కుటుంబంపై కక్ష పెంచుకున్నాడు. ఆ కుటుంబాన్ని చంపాలని పథకం రచించి, జమ్మికుంటలో కత్తి కొనుగోలు చేశాడు. పంచాయతీ కార్యాలయం తలుపులను కాల్చితే సర్పంచ్ భర్త వాసుదేవరెడ్డి అక్కడికి వస్తాడని, అప్పుడు కత్తితో పొడిచి చంపవచ్చని భావించి తలుపులను కాల్చాడు. అక్కడికి ఎవరూ రాకపోవడంతో నేరుగా సర్పంచ్ ఇంటికి వెళ్లాడు. సర్పంచ్ రజిత అత్త లక్ష్మి (70) ఇంటి ముందు కూర్చొని ఉండగా.. అమెను కత్తితో పొడిచి పారిపోయాడు. కుటుంబ సభ్యులు ఆమెను జమ్మికుంటకు చికిత్స కోసం తరలిస్తుండగా లక్ష్మి మృతిచెందింది. వాసుదేవరెడ్డి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. జమ్మికుంట రూరల్ సీఐ కిశోర్, ఎస్సై రాజ్కుమార్ మంగళవారం నిందితుడిని పట్టుకొన్నారు.