చండూరు, సెప్టెంబర్ 6 : నల్లగొండ జిల్లా మునుగోడు నియోజకవర్గంలో బీజేపీకి మరోసారి చుక్కెదురైంది. టీఆర్ఎస్ను కాదని బీజేపీలో చేరిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు తిరిగి ఒక్కొక్కరుగా సొంతగూటికి వస్తున్నారు. వారం రోజుల క్రితం బీజేపీలో చేరిన చండూరు మండలం కొండాపురం ఉప సర్పంచ్ గిరి లింగస్వామిగౌడ్, చొప్పరివారిగూడెం సర్పంచ్ భర్త చొప్పరి వెంకన్న రెండ్రోజుల క్రితం మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్లోకి వచ్చారు. కాగా దోనిపాముల సర్పంచ్ తిప్పర్తి దేవేందర్ విద్యుత్తు శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సమక్షంలో మంగళవారం హైదరాబాద్లో గులాబీ కండువా కప్పుకొన్నారు. ఇప్పటికే కాంగ్రెస్, బీజేపీల నుంచి టీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్న నేపథ్యంలో.. కమలం పార్టీలో చేరినట్లే చేరి తిరిగి టీఆర్ఎస్లోకి వస్తున్న పరిణామాలు బీజేపీకి మింగుడుపడటం లేదు. వివిధ పార్టీల నుంచి బీజేపీలో చేరినవారు రెండు, మూడు రోజుల్లోనే తిరిగి టీఆర్ఎస్లో చేరుతుండటం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.