హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : మానసిక ఒత్తిడి, ఇతర సమస్యల (ర్యాగింగ్, వేధింపులు, పరీక్షలు) కారణంగా బాధపడే విద్యార్థులకు ప్రత్యేక కౌన్సెలింగ్ ఇవ్వాలని జేఎన్టీయూ నిర్ణయించింది. ఇందుకు వర్సిటీ అధికారులు జేఎన్టీయూ హైదరాబాద్ క్యాంపస్లో ‘సంతులన్’ పేరిట ప్రత్యేక కౌన్సెలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ కౌన్సెలింగ్ సెంటర్ వారంలో నాలుగు రోజులు పనిచేస్తుందని వీసీ కట్టా నరసింహారెడ్డి తెలిపారు.
ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా విద్యార్థుల్లో అనేక మానసిక సమస్యలు తలెత్తుతున్నాయని, అందువల్ల వారి లో నేరాలు చేసే తత్వం పెరుగుతున్నదని వీసీ అభిప్రాయపడ్డారు. వీటిపై విద్యార్థులకు సరైన అవగాహన కల్పించేందుకు అన్ని కాలేజీలలో కౌన్సెలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని తెలిపారు. విద్యార్థులకు, టీచింగ్, నాన్టీచింగ్ ఉద్యోగులకు, హాస్టల్ సిబ్బందితోపాటు అన్ని రకాల ఉద్యోగులకు ఎప్పటికప్పుడు మానసిక సమస్యలపై కౌన్సెలింగ్ ఇస్తామని వెల్లడించారు. దశలవారీగా సుల్తాన్పూర్, మంథని, జగిత్యాల, సిరిసిల్లలోని జేఎన్టీయూ క్యాంపస్లలో కూడా ఈ కౌన్సెలింగ్ కేంద్రా లను ఏర్పాటు చేసే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. కౌన్సెలింగ్ కేంద్రంలో కౌన్సెలర్గా ప్రొఫెసర్ బీనా చింతలపూరిని నియమిస్తున్నట్టు వీసీ కట్టా నరసింహారెడ్డి తెలిపారు. వారం రోజుల్లో ఈ కౌన్సెలింగ్ కేంద్రం అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు.