తెలుగుయూనివర్సిటీ, సెప్టెంబర్ 22: తెలుగు సాహిత్యంలో విశ్వజనీన మానవీయ కవిత్వాన్ని సృష్టిస్తున్న కే శివారెడ్డి విశ్వమానవుడని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి కొనియాడారు. శాంతా బయోటెక్స్ అధినేత, పద్మభూషణ్ వరప్రసాదరెడ్డి ఆధ్వర్యంలోని శాంతా-వసంత ట్రస్టు ఉత్తమ సాహితీవేత్త పురస్కారాన్ని గురువారం హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్లో మంత్రి శివారెడ్డికి అందజేసి ఘనంగా సత్కరించారు.
ఒడిదొడుకులకు నిరాశ చెందకుండా, నిజాయితీ కోల్పోకుండా ఉన్నత స్థానానికి చేరుకొన్న శివారెడ్డి ఎందరికో ఆదర్శప్రాయుడని ప్రశంసించారు. కవిగా ఎన్నో పురస్కారాలు అందుకున్న శివారెడ్డికి త్వరలో జ్ఞానపీఠ్ అవార్డు రావాలని ఆచార్య ఎల్లూరి శివారెడ్డి ఆకాంక్షించారు. డాక్టర్ వరప్రసాదరెడ్డి, డాక్టర్ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు.