రవీంద్రభారతి, ఫిబ్రవరి16: సమాజ శ్రేయస్సు కోసం పరితపించిన గొప్ప మేధావి సంత్ శిరోమణి గురు రవిదాస్ మహరాజ్ అని, ఆయన మార్గం అందరికీ అనుసరణీయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. సంత్ రవిదాస్ 645వ జయంతి వేడుకలు బుధవారం రవీంద్రభారతిలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వినోద్కుమార్.. సంత్ రవిదాస్ చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. చర్మకార కులంలో పుట్టిన వజ్రంగా సంత్ రవిదాస్ను అభివర్ణించారు. మానవతా సుగంధాన్ని విరజిమ్మే కవితోద్యమం ఆయన సొంతమని పేర్కొన్నారు. సమాజంలో ప్రతి ఒక్కరూ స్నేహభావంతో మెలగాలని, మనుషులంతా ఒక్కటేనన్న సమానత్వ సందేశాన్ని 14వ శతాబ్దంలోనే ఇచ్చిన సంత్ రవిదాస్ గొప్ప మహానుభావుడని కొనియాడారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సైతం సంత్ రవిదాస్ను అనుసరించినట్టు చరిత్ర చెప్తున్నదన్నారు.
సంత్ రవిదాస్ సేవా మార్గాన్ని రాష్ట్రంలో విస్తృత పరుస్తామని చెప్పారు. చర్మకారుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కార్యక్రమంలో చేవెళ్ళ ఎమ్మెల్యే కాలె యాదయ్య, ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ బండ శ్రీనివాస్, సంత్ రవిదాస్ జయంతి నిర్వహణ కమిటీ చైర్మన్ డాక్టర్ రాజమౌళి, కన్వీనర్ డాక్టర్ చీమ శ్రీనివాస్, నాయకులు ప్రొఫెసర్ తిరుపతి, రాజలింగం, వీరస్వామి, ఎస్సీ మేధావుల ఫోరం రాష్ట్ర చైర్మన్ ఆరేపల్లి రాజేందర్, మున్సిపల్ జేఏసీ నేత తిప్పర్తి యాదయ్య, బాబూ జగ్జీవన్రామ్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ నరేందర్ తదితరులు పాల్గొన్నారు.