చౌటుప్పల్, ఆగస్టు 9: ‘ముచ్చట్లు బాగనే చెప్తున్నరు. గ్యాస్ ధరలను ఇట్ల పెంచితే మేం బతికేదెట్ల? బువ్వ వండుకొని తినాలా? పస్తులుండాలా?’ అని యాదాద్రి భువనగిరి జిల్లా తాళ్లసింగారం మహిళలు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ని నిలదీశారు. ధరలు పెంచుకుంటూపోతే ఎట్ల అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని తాళ్లసింగారంలో చేపట్టిన యాత్రకు మహిళలు బ్రేక్ వేశారు.
గ్రామంలోని చౌరస్తాలో మహిళలు ఉండగా, వారి వద్దకు వెళ్లిన సంజయ్.. బీజేపీ సంక్షేమ పథకాలను వివరించే ప్రయత్నం చేశారు. దాంతో ఆగ్రహం వ్యక్తంచేసిన మహిళలు.. ‘రోజు రోజుకూ గ్యాస్ ధరలు, పెట్రోల్ రేట్లు పెంచుతున్నరు. నిత్యావసర సరుకుల మీద కూడా పన్నులు వేస్తున్నరు. పేదోళ్లు బతుకొద్దా?’ అని నిలదీశారు. దీంతో షాక్కు గురైన బండి వారికి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయినా మహిళలు శాంతించకుండా.. ముందు ధరలు తగ్గించాలని, ఆ తర్వాత ఇలాంటి యాత్రలు చేసుకోవాలని నిలదీయడంతో చేసేది లేక బండి సంజయ్ అక్కడి నుంచి జారుకొన్నారు.