జమ్మికుంట, ఆగస్టు 29: ‘బండి సంజయ్, రేవంత్రెడ్డివి దొంగ పాదయాత్రలు. అధికార దాహం కోసం ప్రజలను రెచ్చగొట్టే యాత్రలు చేస్తున్నరు. శాంతియుతంగా ఉన్న రాష్ట్రంలో మత విద్వేషాలు సృష్టించేందుకు బీజేపీ పాతబస్తీ నుంచి పాదయాత్ర మొదలు పెట్టింది’ అని ఎస్సీసంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో మంత్రి మీడియాతో మాట్లాడారు. ఉద్యమంలో బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎక్కడున్నారో చెప్పాలని డిమాండ్ చేశా రు. రాష్ట్రం కోసం రాజీనామా చేయాలని అన్ని రాజకీయ పార్టీలు భావించినప్పుడు, ఒక్కగానొక్క ఎమ్మెల్యే కిషన్రెడ్డి పారిపోయాడని గుర్తుచేశారు. సంక్షేమంలో ముందుకెళ్తున్న రాష్ర్టాన్ని ఇబ్బంది పెట్టేందుకే పాదయాత్రలు మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
రేవంత్కు సోయి లేదు..
పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి సోయి లేకుండా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నాడని మంత్రి కొప్పుల మండిపడ్డారు. రైతుబంధు, రైతుబీమా, దళితబంధు, కాళేశ్వరం ప్రాజెక్టు, పింఛన్లు, ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో పథకాలను సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని, ఇవేవీ కన్పించడం లేదా అని రేవంత్ను ప్రశ్నించారు. మంత్రులు కేటీఆర్, హరీశ్రావు ప్రజా నాయకులని, ఎన్నికల్లో గెలిచి వచ్చారని, అర్థంపర్థం లేకుండా వారిని విమర్శిస్తే బాగుండదని హెచ్చరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ తక్కళ్లపెల్లి రాజేశ్వర్రావు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.