గాంధీచౌక్, మార్చి 25: ‘అగ్గిపెట్టెలో పట్టే చీర గురించి వినడమే కానీ తొలిసారి చూస్తున్నా.. అద్భుతంగా ఉంది’ అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ సతీమణి సంఘమిత్రదాస్ ప్రశంసించారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు వచ్చిన సందర్భంగా స్థానిక పంచాయతీరాజ్ అతిథి గృహంలో సిరిసిల్ల జిల్లా మేజిస్ట్రేట్ ఎన్ ప్రేమలత ఆమెకు ఘనస్వాగతం పలికారు.
అనంతరం సిరిసిల్ల చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ నేసిన అగ్గిపెట్టెలో పట్టేంత చీర, తదితర వస్ర్తాలను చూసి అభినందించారు. ఆమెతో పాటు వచ్చిన తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కే సుజనికి న్యాయమూర్తులు సిరిసిల్ల చీరను బహూకరించి సత్కరించారు. వారి వెంట సీనియర్ సివిల్ న్యాయమూర్తి శ్రీలేఖ, జూనియర్ సివిల్ న్యాయమూర్తి సౌజన్య, ఉజ్జల్ భూయాన్ కూతురు శ్వేత, కోర్టు పరిపాలన అధికారి శ్రీనివాస్, రాష్ట్ర న్యాయస్థాన ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రమణారావు, సూపరింటెండెంట్లు వామన్ కులకర్ణి, శ్రీనివాస్ ఉన్నారు.