హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): ‘ఒకపక్క హుజూరాబాద్లో ఎన్నికలు జరుగుతుంటే, గజ్వేల్లో సభ పెట్టడం దేనికి?’ అని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ టీ జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికలు జరిగే హుజూరాబాద్ను వదలిపెట్టి గజ్వేల్లో సభ పెట్టడంలో ఆంతర్యం ఏమిటని ఆయన పార్టీనేతలను నిలదీసినట్టు సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఏకపక్ష వైఖరిని నిరసిస్తూ శనివారం జరిగిన పొలిటికల్ అఫైర్స్ జూమ్ మీటింగ్కు జగ్గారెడ్డి డుమ్మా కొట్టారు. దళిత, గిరిజన ఆత్మగౌరవం పేరిట నిర్వహిస్తున్న సభలన్నీ రేవంత్రెడ్డి వ్యక్తిగత భజన సభలుగా మారాయని జగ్గారెడ్డి పార్టీనేతల వద్ద తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. అన్ని పార్టీలు ఇప్పటికే హుజారాబాద్కు అభ్యర్థిని ప్రకటించినా కాంగ్రెస్ ఎందుకు అభ్యర్థిని ప్రకటించడం లేదని ప్రశ్నించినట్టు సమాచారం. పొలిటికల్ ఆఫైర్స్ కమిటీ సమావేశాలకు ఎమ్మెల్యేలు, ఎంపీలను ఆహ్వానించాలని గతంలోనే సూచించినా, ఎందుకు పట్టించుకోవడం లేదని గట్టిగా అడిగినట్టు తెలిసింది. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న తన మాటే చెల్లుబాటు కానప్పుడు ఎందుకు జూమ్ మీటింగ్లో పాల్గొనాలని ప్రశ్నించారని తెలిసింది. ఒకవేళ పాల్గొని మాట్లాడినా నా మాటకు విలువ ఎక్కడుందని రేవంత్రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఉప ఎన్నిక జరుగుతున్న హుజూరాబాద్లో సభ నిర్వహించాలని చెప్పినా పట్టించుకోకపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసినట్టు తెలిసింది. పార్టీ నిర్వహిస్తున్న దండోరా సభల్లో ప్రొటోకాల్ ఎందుకు పాటించడం లేదని జగ్గారెడ్డి ఆగ్రహం వ్యక్తంచేసినట్టు సమాచారం.