హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాల పనులను త్వరలోనే ప్రారంభిస్తామని.. వాటిని దగ్గరుండి పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత స్థానిక ప్రజాప్రతినిధులదేనని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సూచించారు. సింగూరు ప్రాజెక్టు ఎగువన నిర్మించనున్న బసవేశ్వర, సంగమేశ్వర ఎత్తిపోతల పథకాలకు రూ.4,427 కోట్లతో పరిపాలనా అనుమతులను మంజూరు చేయడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ను మంత్రి హరీశ్రావు నేతృత్వంలో ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, భూపాల్రెడ్డి, మాణిక్రావు ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. రెండు ప్రాజెక్టుల ద్వారా బీడు భూములు సస్యశ్యామలంగా మారనున్నాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. లక్షలాది ఎకరాలకు సాగునీటిని అందించే కార్యక్రమంలో భాగస్వాములవుతున్నారని వారిని అభినందించారు. మంత్రి హరీశ్కు ఉన్న అనుభవాన్ని వాడుకోవాలని, ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసుకుంటూ పనులు పూర్తిచేసుకోవాలని సూచించారు.