హైదరాబాద్, మార్చి 23 (నమస్తే తెలంగాణ): భద్రాచలం డివిజన్ పరిధిలో నిర్మించనున్న కొవ్వూ రు రైల్వేలైన్పై కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యంపై బీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు కేంద్రాన్ని నిలదీశారు. గురువారం లోక్సభలో దీనిపై కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వక సమాధానం ఇవ్వాలని కో రారు. భద్రాచలం రోడ్డు – సత్తుపల్లి రైల్వే మార్గంపై పురోగతిని కూడా వివరించాలని కేంద్రాన్ని కోరారు. భద్రాచలం పుణ్యక్షేత్రం, గిరిజన, పారిశ్రామిక ప్రాం తాలను అనుసంధానించే ఈ రైలు మార్గాన్ని కొవ్వూ రు వరకు పొడిగించే అవకాశం ఉందా? అని ఆయన ప్రశ్నించారు. నామా అడిగిన అడిగిన ప్రశ్నకు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రైల్వే ప్రాజెక్టులను రాష్ట్రాల వారీగా కాకుండా జోన్ల వారీగా మంజూరు చేపడుతామని, పూర్తి వివరాలు రైల్వే వెబ్సైట్లో ఉన్నాయని పేర్కొన్నారు.
భద్రాచలం రోడ్- సత్తుపల్లి రైల్వే లైన్ ఇప్పటికే ప్రారంభించామమని చెప్పిన మంత్రి భద్రాచలం రోడ్ -కొవ్వూరు రైల్వే లైన్ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చు లో కొంత పంచుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరామని తెలిపారు. భూసేకరణ, అటవీశాఖ క్లియరెన్స్, సహ భాగస్వామ్యం, అందుకు సంబంధించిన వాటా మొత్తాన్ని జమ చేయడం, చట్టబద్ధమైన అనుమతులు, భౌగోళిక పరిస్థితులు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకొని కొత్త ప్రాజెక్టులను మం జూరు చేస్తామని వివరించారు. కేంద్రమంత్రి ఇచ్చిన సమాధానంపై నామా అసంతృప్తిని వ్యక్తం చేశారు. తాను అడిగిన ప్రశ్నలో కొత్త ప్రాజెక్టుల వివరాలు, ప్రతిపాదిత ప్రాజెక్టులు, నిధుల వివరాలు వెల్లడించలేదని ఆయన కేంద్రంపై మండిపడ్డారు.