హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతుండటంతో రాష్ర్టాలు లాక్డౌన్ ఆంక్షలను సడలిస్తున్నాయి. దీంతో చాలామంది కరోనాపట్ల మళ్లీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు పెట్టుకోకుండా, భౌతికదూరం పాటించకుండా ఉపద్రవంతో ఆటలాడుతున్నారు. కరో నా పట్ల అప్రమత్తంగా లేకపోతే ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సెకండ్వేవ్ తగ్గుముఖం పట్టిన తర్వాత ప్రజలు ఏమేరకు కరోనా నిబంధనలు పాటిస్తున్నారన్న అంశంపై లోకల్ సర్కిల్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. చాలా ప్రాంతాల్లో ప్రజలు మాస్కులు ధరించడం లేదని, కొందరు ముక్కు, నోటిని కప్పి ఉంచేలా కాకుండా గదమ మీద మాస్క్ పెట్టుకుంటున్నారని తేలిం ది. దేశవ్యాప్తంగా 312 జిల్లాల్లో 33 వేల మందిని ప్రశ్నించి ఈ సర్వే నిర్వహించారు. నూటికి 67 మంది మాస్కులు ధరించటంలేదని సర్వేలో తేలింది. వ్యాక్సినేషన్ సెంటర్లలోనూ మాస్కులు ధరించటంలేదని 32% మంది తెలిపారు. ప్రతి ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు సాధారణ క్లాత్ మాస్కులు ధరిస్తున్నారని ఈ సర్వే వెల్లడించింది.