వెంగళరావునగర్, జనవరి 4: వచ్చే ఏడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం తరపున సావిత్రీబాయి ఫూలే జయంతి రోజు ఉత్తమ ఉపాధ్యాయినులను సత్కరిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. సామాజిక విప్లవకారిణి, దేశంలోనే తొలి మహిళా ఉపాధ్యాయిని సావిత్రీబాయి ఫూలే జీవితం స్ఫూర్తిదాయకమని అన్నారు. శ్రీనగర్కాలనీలోని మంత్రి సబిత క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆకృతి స్వచ్ఛందసంస్థ ఆధ్వర్యంలో సావిత్రీబాయి ఫూలే 192వ జయంతి వేడుకలను నిర్వహించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆనాడు సావిత్రీబాయి ఫూలే నిమ్నజాతి వర్గాల కోసం, కట్టుబాట్లను, సామాజిక దురాచారాలను వ్యతిరేకిస్తూ ఉద్యమించిన వీరవనిత అని చెప్పారు. అణచివేతకు వ్యతిరేకంగా స్త్రీల సాధికారిత కోసం మహిళా హక్కుల కోసం నినదించిన సావిత్రిబాయి ఆశయాలు ఆదర్శనీయమని పేర్కొన్నారు. వచ్చే ఏడాది నుంచి తెలంగాణ ప్రభుత్వం తరపున సావిత్రీబాయి ఫూలే జయంతి రోజున ఉత్తమ ఉపాధ్యాయినులను సత్కరిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయినిగా ఎంపికైన పద్మప్రియకు సావిత్రీబాయి ఫూలే పురస్కారాన్ని మంత్రి అందజేశారు. కార్యక్రమంలో గ్రంథాలయా ల సంస్థ చైర్మన్ అయాచితం శ్రీధర్, ఆకృతి సుధాకర్, మాజీ ఎమ్మెల్సీ పీ సుధాకర్రెడ్డి, గార్లపాటి వేణు, సామాజికవేత్త నగేశ్, పెండ్యాల తదితరులు పాల్గొన్నారు.