హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): నూతనంగా నియమితులైన నర్సింగ్ ఆఫీసర్లకు త్వరలో వేతనాలు అందజేయనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఫిబ్రవరిలో విధుల్లో చేరిన నర్సింగ్ ఆఫీసర్లకు రెండు నెలలు గడుస్తున్నా వేతనాలు ఇవ్వకపోవడంపై ‘నమస్తే తెలంగాణ’లో శుక్రవారం ప్రచురితమైన కథనానికి వైద్యారోగ్య శాఖ స్పందించింది.
డీఎంఈ విభాగంలో మొత్తం 5,600 మంది ఉద్యోగులు చేరినట్టు పేర్కొన్నది. వీరికి ఎంప్లాయీ ఐడీ, పీఆర్ఏఎన్ నంబర్ కేటాయించే ప్రక్రియ జరుగుతున్నట్టు వెల్లడించింది. త్వరలో ఈ ప్రక్రియ పూర్తి చేసి వేతనాలు అందించనున్నట్టు వెల్లడించింది.