హైదరాబాద్, డిసెంబర్ 27 (నమస్తే తెలంగాణ): మహిళల సమస్యల పరిష్కారానికే సఖి సెంటర్లను ఏర్పాటుచేశామని, ఎలాంటి సమస్య వచ్చినా తక్షణమే ఆయా కేంద్రాల్లో ఫిర్యాదుచేయాలని తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి సూచించారు. జిల్లాస్థాయిలో సఖి సెంటర్లు, రాష్ట్రస్థాయిలో మహిళా కమిషన్ చర్యలు తీసుకుంటాయని మహిళలకు భరోసా ఇచ్చారు. సోమవారం హైదరాబాద్లోని మహిళా కమిషన్ కార్యాలయంలో ‘గృహహింస నిరోధక చట్టం-2005’పై నిర్వహించిన వెబినార్లో ఆమె మాట్లాడారు. కమిషన్కు నేరుగా ఫిర్యాదు చేయలేనివారు ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాంలో @scwtelangana, ఈమెయిల్.. telanganastatewomenscommission@gmail.com ద్వారా కూడా మహిళలకు జరిగే అన్యాయాన్ని కమిషన్ దృష్టికి తీసుకురావొచ్చని సూచించారు. కార్యక్రమంలో కమిషన్ సభ్యులు షాహీన్ అఫ్రోజ్, ఈశ్వరీబాయి, కొమ్ము ఉమాదేవియాదవ్, గద్దల పద్మ, సుధాం లక్ష్మి, కటారి రేవతిరావు, సెక్రట రీ జీ కృష్ణకుమారి, సెక్షన్ ఆఫీసర్స్ వరలక్ష్మి, సుల్తానా, శిశు సంక్షేమశాఖ అధికారులు, జిల్లా, మండల సమాఖ్య అధికారులు, సఖి సెంటర్ సిబ్బంది పాల్గొన్నారు.