హైదరాబాద్ః అథ్లెటిక్స్లో పతకాలు సాధించిన మహిళా ఉద్యోగులను అభినందించారు ఆర్టీసీ ఎండీ సజ్జనార్. గచ్చిబౌలి స్టేడియంలో ఈనెల 4వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగిన రెండో జాతీయ మహిళా మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్-2022 పోటీల్లో టీఎస్ ఆర్టీసీ తరఫున ఆరుగురు మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో మంజుల, శివలీల, సంగీత, సునీత, శ్రీదేవి, స్వరాజ్యలక్ష్మీ 15 పతకాలు సాధించారు. వీటిలో ఐదు బంగారు, ఒక వెండి, తొమ్మిది కాంస్య పతకాలు ఉన్నాయి. వీళ్లను తన కార్యాలయంలో అభినందించన సజ్జనార్… ప్రావీణ్యం సాధించనవాళ్లు సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతారని, క్రీడల్లో అనుకున్న లక్ష్యాన్ని ఛేదించేందుకు నిరంతర కృషితో పాటు పట్టుదల ముఖ్యమని అన్నారు.
26 రాష్ట్రాల నుంచి మొత్తం 436 మంది క్రీడాకారిణులు పాల్గొన్న ఈ చాంపియన్షిప్లో ఆర్టీసీ మహిళా సిబ్బంది సత్తా చాటడంపై సంతోషం వ్యక్తం చేశారు సజ్జనార్. ఈ ఏడాది డిసెంబర్లో మలేషియాలో నిర్వహించనున్న అంతర్జాతీయ అథ్లెటిక్స్ ఛాంపియన్స్లో ఆర్టీసీ నుంచి క్రీడాకారులు పాల్గొనడంపైనా ఆర్టీసీ ఎండీ సంతోషం వ్యక్తం చేశారు. ఆ పోటీల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులు సత్తా చాటుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ చీఫ్ పర్సనల్ మేనేజర్ ఎస్ కృష్ణకాంత్, టీం ఫిజియోథెరఫిస్ట్ హెమాన్స్ కుమార్, టీం మేనేజర్ జీపీ లక్ష్మణ్ పాల్గొన్నారు.