హైదరాబాద్, డిసెంబర్ 11 (నమస్తే తెలంగాణ)/మారేడ్పల్లి: రద్దీ సమయాల్లో ప్రయాణికులు కొంత సంయమనం పాటించి.. సిబ్బందికి సహకరించాలని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలు తీరును సోమవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. హైదరాబాద్లోని జూబ్లీబస్ స్టేషన్ (జేబీఎస్)ను ఆకస్మికంగా తనిఖీ చేశారు.
జేబీఎస్-ప్రజ్ఞాపూర్, జేబీఎస్-జనగామకు వెళ్లే పల్లెవెలుగు బస్సుల్లో, బాన్సువాడకు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఉన్న మహిళా ప్రయాణికులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత ప్రయాణ సౌకర్యం అమలవుతున్న తీరును అడిగి తెలుసుకున్నారు. జేబీఎస్-వెంకట్నగర్ (రూట్ నంబర్ 18) సిటీ ఆర్డినరీ బస్సుల్లో మెట్టుగూడ వరకు ప్రయాణించారు. అందులో మహిళా ప్రయాణికులకు జీరో టికెట్ను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ఎక్కడైనా చిన్నపాటి పొరపాట్లు జరిగితే ఆర్టీసీ అధికారుల దృష్టికి తీసుకురావాలని కో రారు.
24 గంటలు అందుబాటులో ఉండే సం స్థ కాల్ సెంటర్ 040-69440000,040-23450033 ఫోన్ చేసి చెప్పాలని సూచించారు. వాటిని వెంటనే సరిదిద్దుకునేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మహిళా ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సంస్థ అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పారు. పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ బస్సుల్లో ప్రయాణించే మహిళలు ఆధార్ కార్డులను చూపించి, సంస్థకు సహకరించాలని కోరారు. ఉచిత ప్రయాణ సౌకర్యం ప్రవేశపెట్టగానే రద్దీ పెరిగిందని, అందుకు అనుగుణంగా బస్సులను నడిపేందుకు కార్యాచరణ రూపొందించామని ఎండీ చెప్పారు.