దండేపల్లి, మార్చి 21: మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొత్త మామిడిపల్లికి చెందిన ఎంబడి సాయిష్మను ప్రేమ పేరిట వేధించి, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎన్ఎస్యూఐ మండల అధ్యక్షుడు నలిమెల వినయ్ని కఠినంగా శిక్షించాలంటూ కుటుంబ సభ్యులు, గ్రామస్థులు మేదరిపేట ప్రధాన రహదారిపై మంగళవారం ఆందోళనకు దిగారు. ఈ నెల 13న సాయిష్మకు నిశ్చితార్థం జరగ్గా, 18న మధ్యాహ్నం నలిమెల వినయ్ ఆమెకు ఫోన్ చేసి పెండ్లి చేసుకోవాలని బెదిరించాడని, ఫోన్లో మాట్లాడుతుండగానే యువతి ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని వారు ఆరోపించారు. ఆమె పురుగుల మందు తాగడంతో హైదరాబాద్లోని నిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందింది.
మంగళవారం సాయిష్మ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి స్వగ్రామానికి తరలిస్తుండగా తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. బంధువులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు సాయిష్మ మృతదేహాన్ని రోడ్డుపై ఉంచి గంటకుపైగా రాస్తారోకో చేశారు. దీంతో ఇరువైపులా పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. నలిమెల వినయ్తోపాటు అతడికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించాలంటూ డిమాండ్ చేశారు.
న్యాయం జరిగే వరకూ ఇక్కడి నుంచి కదలబోమని భీష్మించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీఐ కృష్ణారెడ్డి, ఎస్సై సాంబమూర్తి బాధిత కుటుంబ సభ్యులకు నచ్చజెప్పారు. ఆత్మహత్యకు ప్రేరేపించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనంతరం మృతదేహాన్ని పోలీసు బందోబస్తు మధ్య గ్రామానికి తరలించారు. అంత్యక్రియలకు తరలిస్తున్న క్రమంలో నిందితుడి ఇంటి వద్దకు రాగానే స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకున్నది. పోలీసులు ఇరువర్గాలను సముదాయించి అంత్యక్రియలు పూర్తి చేశారు.