హైదరాబాద్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన సినీ హీరో సాయి ధరమ్ తేజ్ గణనాథుడి ఆశిస్సులతో త్వరగా కోలుకుంటాడని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ప్రస్తుతం అపోలో దవాఖానలో చికిత్స పొందుతన్న ఆయన ఆరోగ్యం గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపినట్లు వెల్లడించారు. దేవుని దయతో తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కాగా, సాయిధరమ్ తేజ్ ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని అపోలో ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, కాలర్ బోన్ ఫ్యాక్చర్ అయిందన్నారు. మరో 48 గంటల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉండాలని చెప్పారు.
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడైన సాయిధరమ్ తేజ్.. శుక్రవారం రాత్రి హైదరాబాద్లోని దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జిపై నుంచి బైక్పై వెళ్తుండగా అదుపుతప్పి కిందపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఆయన ఆయన కంటి పైభాగం సహా ఛాతీ భాగంలో గాయలయ్యాయి.
ఇదిలాఉండగా సాయిధరమ్ తేజ్పై రాయదుర్గం పోలీసులు 336 IPC,184M.V.Act సెక్షన్లు కింద కేసు నమోదు చేశారు. అతివేగం, నిర్లక్ష్యంగా బైక్ నడిపినందుకు ఈ కేసు నమోదు చేసినట్లు తెలిపారు.